శామీర్పేట, ఏప్రిల్ 28 : ఓట్లేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా ఉండి పనిచేస్తానని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతలపల్లి మండలం నారాయణపూర్ గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్, బీజేపీ నాయకుడు హనుమంతు, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కవితతో పాటు 50 మంది టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా గురువారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఇతర పార్టీల నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు.
నారాయణపూర్ను ఆదర్శంగా అభివృద్ధి చేస్తా..
ఉపసర్పంచ్, వార్డు సభ్యుడితో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వారి కోసం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. గ్రామంలో ప్రజాప్రతినిధులు కోరినట్టుగా మురుగునీటి తొలగింపు కోసం రూ.25 లక్షలతో కాలువ, వెయ్యి మీటర్ల సీసీ రోడ్డు, మహిళల కోసం మహిళా భవనం మంజూరు చేస్తామని తెలిపారు. మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, సుదర్శన్, మాజీ అధ్యక్షుడు విష్ణుగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అనిల్రెడ్డి, గ్రామ అధ్యక్షుడు లక్ష్మయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ హారికామురళీ గౌడ్, సర్పంచులు రాంచంద్రయ్య, రవి, ప్రభాకర్రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, మాజీ సర్పంచ్ సత్తయ్య, మద్దుల శ్రీనివాస్రెడ్డి, ఆంజనేయులు, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.