అంబర్పేట, నవంబర్ 28 : అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వివిధ విభాగాల అధికారులకు చెప్పారు. చేపట్టాల్సిన పలు నూతన అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమై అధికారులతో బుద్దభవన్లో చర్చించారు. హుస్సేన్సాగర్ నుంచి గోల్నాక వరకు నాలాలు తరచూ వ్యర్థాలతో నిండిపోతున్నాయని, వాటి పూడికతీత అలాగే ఆధునీకరణ కోసం ప్రభుత్వం జీహెచ్ఎంసీ ద్వారా సుమారు రూ.68 కోట్లు కేటాయించిందని చెప్పారు. అందులో అంబర్పేట నియోజకవర్గానికి రూ.31 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మెయిన్ చెరువు నుండి మల్లికార్జున నగర్, బాపునగర్ మీదుగా మూసీలో కలిసే నాలాలో పూడికతీత, ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను పూర్తి చేయాలని సూచించారు. బతుకమ్మకుంట నుండి ఛే నంబర్ మీదుగా కాలా బ్రిడ్జి వరకు ఉన్న నాలాలో వాన నీరు కలిసేలా చేయాల్సిన పనులపై అధ్యయనం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ అండ్ డీపీ చీఫ్ ఇంజినీర్ వసంత, ఎస్ఈలు మురళీకృష్ణ, భాస్కర్, ఈఈలు గోవర్ధన్, నారాయణ, డీఈ వెంకట కిరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.