సినీ తారలు ఫ్యాషన్ షోలలో మెరిసిపోవడం తెలిసిందే. ఈ మధ్య జరిగిన ‘పారిస్ కొచర్ వీక్’లో జాన్వీ కపూర్ కాంచీపురం పట్టు
చీరతో క్యాట్వాక్ చేసింది. చీరకు తగ్గ మీనాకారీ ఆభరణాలతో ర్యాంప్పై మెరిసిపోయిన జాన్వీ అందం ఆహుతులను అలరించింది. ఆ తర్వాత కూడా ఆమె మాటలు, ఫొటోలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. భారతీయ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా దుస్తుల ప్రదర్శనలో పాల్గొన్న జాన్వీ ఆ ఫొటోలతోపాటు పట్టుతో తనకున్న అనుబంధాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ‘నా గాడ్ ఫాదర్, నా గురువు, నా దారి దీపం, నా భరోసా, నాకు నమ్మకమైన మనిషి మనిష్ మల్హోత్రా కోసం పారిస్ కొచర్లో అడుగుపెట్టాను.
ఈ దుస్తులు ఆకర్షణీయమైనవి, సృజనాత్మకమైనవే కాదు. నాకు మా అమ్మ జ్ఞాపకాలు కూడా. చిన్నప్పుడు అమ్మతోపాటు వేడుకలకు వెళ్తే అందమైన కాంచీపురం, పోచంపల్లి చీరలు కట్టేది. ఆనాటి పెండ్లిళ్లు, పేరంటాల్లోనే కాదు సినీ తారలు అందానికి, హుందాతనానికి కాంచీపురం, పోచంపల్లి పట్టు కట్టేవాళ్లు. అలా నా బాల్యంలోనే ఈ చీరలపై ఇష్టం ఏర్పడింది. ఈ చీరలు అందమైనవి, ఆకట్టుకునేని మాత్రమే కావు.. అమ్మను గుర్తుచేసేవి కూడా’ అంటూ తన సెంటిమెంట్ని సోషల్ మీడియాలో పంచుకున్నది జాన్వీ.