సుల్తాన్బజార్, నవంబర్ 28: ఉద్యోగులు ఆరోగ్యవంతులుగా ఉండాలనే ధ్యేయంతో వారికి ఆటల పోటీలు నిర్వహించినట్టు, నిత్యం శ్రమించే వారికి క్రీడలు దోహదపడుతాయని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని అన్నారు. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో నిర్వహిస్తున్న స్పోర్ట్ అండ్ గేమ్స్లో క్రికెట్ పోటీలు నాల్గవ రోజైన ఆదివారం ముగిశాయి. ఈ పోటీలలో పలు యూనిట్ల టీంలు పాల్గొనగా విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన విజేతలను, రన్నరప్ టీమ్లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ నేటితో క్వార్టర్ ఫైనల్ వరకు క్రికెట్ పోటీలు ముగిశాయని తెలిపారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ సబ్ రిజిస్ట్రార్ ఏఎం చంద్రశేఖర్, రామక్రిష్ణా రెడ్డి, అసదుద్దీన్ హుస్సేని, జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్ కుమార్, ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్, సభ్యులు ఖాలెబ్ అహ్మద్, బి.శంకర్, వైదిక్ శస్త్ర, కుతుబుద్దీన్, శ్రీధర్ నాయుడు వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.