సిటీబ్యూరో/సుల్తాన్బజార్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ప్రశాంత వాతావరణంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించేందుకు 8 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే 12 కిలోమీటర్ల శోభాయాత్ర మార్గాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సికింద్రాబాద్ తాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకుంటుంది. శోభాయాత్ర రూట్ను అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రధాన మార్గంలో తనిఖీలు నిర్వహించి యాత్ర ప్రశాంతంగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేసినట్లు తెలిపారు. యాత్రసాగే మార్గంలో సీసీ కెమెరాలతో పాటు నాలుగు డ్రోన్ కెమెరాలు, నాలుగు మౌంటెడ్ వెహికల్ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు. రూట్ను పరిశీలించిన వారిలో సీపీతోపాటు అదనపు సీపీ డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీలు విశ్వప్రసాద్, ఏవీ రంగనాథ్, ఎం.రమేశ్, డీసీపీలు గజరావు భూపాల్, చందనా దీప్తి, రాజేశ్ చంద్ర, చక్రవర్తి గుమ్మి, ప్రకాశ్రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు.. ట్రాఫిక్ డైవర్షన్లు
గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి తాడ్బండ్లోని ఆంజనేయస్వామి ఆలయం వరకు శనివారం నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. బందోబస్తులో ఉన్న పోలీసులకు సహకరించాలని కోరారు. శోభాయాత్ర గౌలిగూడలో ఉదయం 11.30గంటలకు ప్రారంభమవుతుందని, రాత్రి ఎనిమిది గంటల సమయంలో తాడ్బండ్లోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయం వద్ద నుంచి వస్తున్న మరో ర్యాలీ కోఠి వద్ద ప్రధాన శోభాయాత్రలో కలుస్తుందని తెలిపారు.
శోభాయాత్ర సాగే మార్గమిదే..
గౌలిగూడ శ్రీరామమందిరం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి ఎక్స్రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్రోడ్స్, కోఠి, తిలక్రోడ్, సుల్తాన్బజార్, రాంకోఠి, కాచిగూడ ఎక్స్రోడ్స్, నారాయణగూడ, చిక్కడపల్లి ఎక్స్రోడ్స్, ఆర్టీసీ క్రాస్రోడ్స్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి అశోక్నగర్, గాంధీనగర్, వైస్రాయ్ హోటల్ వెనుక వైపు నుంచి, ప్రాగా టూల్స్, కవాడిగూడ, బన్సీలాల్పేట్, బైబుల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూం మీదుగా ఉజ్జయినీ మహంకాళి ఆలయం, రామ్గోపాల్పేట్ పీఎస్, ప్యారడైజ్ ఎక్స్రోడ్స్, సీటీవో జంక్షన్, రాయల్ లీ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ నుంచి ఎడమ వైపు మీదుగా తాడ్బండ్లోని శ్రీహనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. 12 కిలోమీటర్లు కొనసాగే ఈ యాత్ర రాత్రి 8 గంటల వరకు పూర్తవుతుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అదేవిధంగా, కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి వస్తున్న మరో ర్యాలీ చంపాపేట్ ఎక్స్రోడ్స్, ఐఎస్ సదన్, దోబిఘాట్, మలక్పేట్ ఏసీపీ ఆఫీస్, సైదాబాద్ కాలనీ రోడ్డు, సరూర్నగర్ ట్యాంక్, కొత్తపేట, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, నల్లగొండ క్రాస్రోడ్డు, చాదర్ఘాట్ నుంచి కోఠి డీఎం అండ్ హెచ్ జంక్షన్ వద్దకు చేరుకొని అక్కడ ప్రధాన ర్యాలీలో కలుస్తుందన్నారు.
ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లండి..
శోభాయాత్రం వెళ్లే మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో వాహనదారులు ప్రయాణించి తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూం (040-27852482), ట్రాఫిక్ హెల్ప్ లైన్(9010203 626)కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూం, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్(https://twitter.com/HYDTP, https://facebook.com/HYDTP/) ద్వారా సమాచారాన్ని తెలుపాలని సీవీ ఆనంద్ సూచించారు.