బడంగ్పేట, మార్చి14: మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 28వ డివిజన్లోని సప్తగిరి కాలనీలో మంచి నీటి పైపులైన్ పనులకు సోమవారం సాయంత్రం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నగర శివారు ప్రాంతాలైన మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రూ.1200 కోట్లతో 250 కిలో మీటర్ల మేరకు పైపులైన్ వేయిస్తున్నట్లు పేర్కొన్నారు. పైపులైన్ పనులు పూర్తయితే నీటి సమస్య తీరుతుందని అన్నారు. పైపులైన్ పనులకు కాలనీ వాసులు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య వస్తే మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు చొరవ తీసుకొని పరిష్కరించాలని సూచించారు. ఈ పైపులైన్ పనులు పూర్తయితే 2.70లక్షల కుటుంబాలకు నీటి సమస్య ఉండదని తెలిపారు. ఆగస్టులోపు పైపులైన్ పనులను పూర్తి చేయాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, స్థానిక కార్పొరేటర్ సూర్ణగంటి అర్జున్, కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీఅరుణా చలేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు
నందిహిల్స్లో ఉన్న శ్రీఅరుణా చలేశ్వర స్వామి ఆలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, ధనలక్ష్మి రాజు, కార్పొరేటర్లు, పాల్గొన్నారు.