మేడ్చల్ రూరల్, మార్చి 13: మేడ్చల్ పట్టణలో జరుగుతున్న ‘రైల్వే అండర్ బ్రిడ్జి’ పనులు త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. మంత్రి ఆదివారం అధికారులు, నాయకులతో కలిసి వంతెన పనులను పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్న అనంతరం, ఆయన మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ కరెంట్ స్తంభాలు, మిషన్ భగీరథ పైపులైన్ సమస్యను తొలగిస్తే పనులు చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి త్వరగా స్తంభాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, మిషన్ భగీరథ పైపులైన్ సమస్యను అవసరమైతే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, కౌన్సిలర్లు కౌడె మహేశ్, జాకట దేవరాజ్, తుడుం గణేశ్, స్వామి యాదవ్, మణికంఠ గౌడ్, బత్తుల శివ కుమార్ యాదవ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, జంగ హరికృష్ణ యాదవ్, నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, విష్ణుచారి, మధుకర్ యాదవ్, నడికొప్పు నాగరాజు, సందీప్ గౌడ్, రవీందర్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.