సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ);కొవిడ్ తర్వాత ఆన్లైన్ కొనుగోళ్లు పెరిగాయి. ఉప్పు, పప్పులు మొదలుకుని సినిమా టిక్కెట్ల వరకు ఆన్లైన్లోనే కొంటున్నారు. ఎంటర్టైన్మెంట్కు అధిక ప్రాధాన్యత ఇచ్చే నగర సినీ ప్రేమికులు ఆన్లైన్ టిక్కెట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆన్లైన్ సినిమా టికెట్స్ బుకింగ్స్ అత్యధికంగా ఉన్న ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలను దాటి హైదరాబాద్ నంబర్వన్గా నిలిచింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్ ఫామ్ ‘బుక్ మై షో’ వెల్లడించిన 2022 సంవత్సర నివేదికలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుజూశాయి.
ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలను చూడడం పెరిగినప్పటికీ.. చాలామంది సినీ ప్రేమికులు మాత్రం థియేటర్కు వెళ్లి బిగ్ స్క్రీన్పైనే సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. ‘బుక్ మై షో’ నివేదికను బట్టి సినీ రంగంలోనూ ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్దే అతి పెద్ద బిజినెస్ అని నిరూపితమవుతోంది. ‘బుక్ మై షో’ నివేదిక ప్రకారం.. ఈ ఏడాదిలో సుమారు 8 మిలియన్ల భారతీయ ప్రేక్షకులు ఆన్లైన్ ద్వారా పలు భాషల్లో సినిమాలను తిలకించగా.. వీరిలో 6 లక్షల మంది సోలో టికెట్ ద్వారా థియేటర్లకు వెళ్లినట్లు తేలింది. హైదరాబాద్తోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలలో ఆన్లైన్ సినిమా టికెట్స్ బుకింగ్స్ అత్యధికంగా ఉన్నట్లు ‘బుక్ మై షో’ తన విశ్లేషణలో తెలిపింది.
టాప్ వన్లో కేజీఎఫ్-2
ఈ ఏడాదిలో 77 వరకు సినిమాలను ప్రేక్షకులు ఆదరించగా.. ‘బుక్ మై షో’ విడుదల చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో కేజీఎఫ్-2 మొదటి స్థానంలో నిలిచింది. ‘బుక్ మై షో’లో ఏకంగా 17.7 మిలియన్ టికెట్స్ ఆన్లైన్లో బుకింగ్ అయ్యాయి. సినిమా విడుదలైన ఏప్రిల్ 14న ఒక్క రోజులోనే 2.14 మిలియన్ టికెట్స్ ఆన్లైన్లో అమ్ముడుపోయాయి. రెండో స్థానంలో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ నిలిచింది. విక్రమ్, కాంతార వంటి చిత్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. థియేటర్లలోనే సినిమాను చూడాలనే ఆసక్తితో సినీ ప్రేమికులు ఆన్లైన్లో టికెట్లను అడ్వాన్స్గా బుకింగ్ చేసుకుంటున్నారు. డబ్బులు కాస్త ఎక్కువ అయినా సరే.. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేస్తున్నట్లు ‘బుక్ మై షో’ నివేదిక స్పష్టం చేస్తున్నది.