సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడుతాయని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం విక్టరీ ప్లేగ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఒత్తిడికి లోనవకుండా ఉత్సాహవంతంగా పనిచేసేందుకు క్రీడలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ క్రీడా మైదానాల్లో ప్రతి యేటా వేసవిలో ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని పేర్కొన్నారు. ఉద్యోగులకు నాలుగు రోజుల పాటు స్పోర్ట్స్ మీట్ను జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎల్బీనగర్ జోన్ డీఆర్ఎఫ్ ట్రైనీ సెంటర్, ఫతుల్లాగూడ, విక్టరీ ప్లేగ్రౌండ్లలో మహిళలకు, పురుషులకు ఇండోర్, ఔట్ డోర్ గేమ్లను విజయవంతంగా నిర్వహించారు.
9 విభాగాల్లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో 2,300 మంది పాల్గొనగా అందులో జోనల్ లెవెల్లో 1800, మల్టీ జోనల్ లెవెల్లో 550 మంది పాల్గొన్నారు. విజేతలైన ఉద్యోగులకు మొదటి బహుమతి రూ.10వేలు, ద్వితీయ బహుమతి రూ.6వేలు, తృతీయ బహుమతి రూ.3వేలతో పాటు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను మేయర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ రవికిరణ్, జాయింట్ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, డిప్యూటీ కమిషనర్ నాయక్, గేమ్స్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్, మాధవి, వీరానంద్, శ్రీనివాస్గౌడ్, వెంకట్రెడ్డి, రఫ్, కోచ్లు విజయానంద్, రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ హరిదాసు, రాజేశ్వర్ వ్యాఖ్యాత మల్లేశ్ పాల్గొన్నారు.