సిటీబ్యూరో, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ) : దేశానికి సమగ్రమైన హెల్త్ పాలసీ ఎంతో అవసరమని పలువురు పోషకాహార, హెల్త్ ఎకనామీ నిపుణులు అభిప్రాయపడ్డారు. జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంలో పన్నుల పాత్ర’ అనే అంశంపై జాతీయ స్థాయి వెబినార్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎన్ఐఎన్ డైరెక్టర్ హేమలత మాట్లాడుతూ… సబ్సిడీతోనే హెల్దీ ఫుడ్ వినియోగం పెరుగుతుందని, జంక్ ఫుడ్, షుగర్, ఉప్పు, హానికరమైన ఆహారాన్ని తగ్గించడంలో పన్నులే కీలకంగా మారుతాయని, హెల్దీ ఫుడ్ను ప్రోత్సహించేలా ఎలాంటి సబ్సిడీలను అమలు చేయడం లేదన్నారు. పోషకాలనిచ్చే పదార్థాల ధరలు మాత్రం సామాన్యుడికి అందుబాటులో లేవని పేర్కొన్నారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ మీరా శేఖర్ మాట్లాడుతూ… ఊబకాయం అంతర్జాతీయ సమస్యగా మారుతుందని, చెడు ఆహారాన్ని నియంత్రించాలన్నారు. 96 దేశాలు ఉప్పు వినియోగాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయని, హెచ్ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ను నియంత్రించేలా విద్యార్థి దశలోనే అవగాహన, ఉత్పత్తిపై నియంత్రణ, పన్నుల పెంపు వంటి చర్యలను ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయని పలువురు వక్తలు వివరించారు. వెబినార్లో ఎన్ఐఎన్ సైంటిస్ట్ సుబ్బారావు, డీకి యూనివర్సిటీ ప్రొఫెసర్ క్యాథరిన్ బ్యాక్హోలర్, నీతి అయోగ్ డిప్యూటీ సెక్రటరీ హేమంత్ కుమార్ మీనా, పబ్లిక్ హెల్త్ పాలసీ అనలిస్ట్ రీజో జాన్ పాల్గొన్నారు.