బంజారాహిల్స్,డిసెంబర్ 9;ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతో పాటు వాహనదారుల్లో క్రమశిక్షణను అలవాటు చేసే లక్ష్యంతో ప్రారంభించిన ‘ఆపరేషన్ రోప్’ అమలును జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అక్టోబర్ 30 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ రోప్లో భాగంగా పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారుల్లో అవగాహన కల్పించారు. సిగ్నళ్ల వద్ద స్టాప్లైన్స్ దాటకుండా చూడడం, రద్దీ చౌరస్తాల్లో ఎడమవైపునకు ట్రాఫిక్ను సాఫీగా వెళ్లేలా చూసేందుకు ఫ్రీ లెఫ్ట్లు ఏర్పాటు చేశారు. ఫ్రీ లెఫ్ట్లు బ్లాక్ చేసేవారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్తో పాటు ట్రాఫిక్ పరిధిలోని అన్ని ప్రధాన కూడళ్లలో మొదటి పదిహేనురోజులు అవగాహనపై దృష్టి పెట్టిన ట్రాఫిక్ పోలీసులు నవంబర్ 15నుంచి ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై జరిమానాలు విధించడం ప్రారంభించారు.
12,224 వాహనాలకు జరిమానాలు
ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఆపరేషన్ రోప్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నెలరోజుల క్రితం ప్రారంభించిన ఆపరేషన్ రోప్లో భాగంగా స్టాప్ సిగ్నళ్లను దాటిన 12,224 వాహనాలపై జరిమానాలు విధించారు. దీంతో పాటు ఫ్రీ లెఫ్ట్లు బ్లాక్ చేసిన 2,207వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. ఇటీవల కొత్త ట్రాఫిక్ నిబంధనల మేరకు త్రిబుల్ రైడింగ్లకు పాల్పడుతున్న 88మందితో పాటు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న 78మందిపై కూడా జరిమానాలు విధించారు. మొత్తం మీద నగరంలోనే అత్యంత కీలకమైన ప్రాంతమైన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆపరేషన్ రోప్ కఠినంగా అమలు చేస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు చాలా వరకు తగ్గినట్లు వాహనదారులు సైతం అభిప్రాయపడుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వాహనదారులు సాఫీగా వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్ నిబంధనలు రూపొందించడం జరిగింది. అయితే కొంతమంది రూల్స్ పాటించకపోవడం వల్ల మిగిలిన వారికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్లు పడిన సమయంలో ఇష్టారాజ్యంగా ముందుకు రావడం, తద్వారా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టడం కనిపిస్తుంటుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడంతో పాటు ట్రాఫిక్ సిగ్నళ్ల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిందే.
– వినోద్కుమార్, ఇన్స్పెక్టర్,జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్