బడంగ్పేట, నవంబర్ 28 : ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో 73 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలాపూర్ మండల ప్రజలకు వైద్యం అందించడానికి మొదటి సారిగా బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గానికి 12 బస్తీ దవాఖానలు మంజూరు చేయగా.. 11 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అదేవిధంగా బడంగ్పేట, నాదర్గుల్, గుర్రంగూడ, అల్మాస్గూడలో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ గీత, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈ అశోక్ రెడ్డి, డాక్టర్ శారద, వినోద్, అబీబా, కార్పొరేటర్లు ఎర్ర మహేశ్వరి జైహింద్, బండారి మనోహర్, జనిగ భారతమ్మ, వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, తదితరులు ఉన్నారు.