ముషీరాబాద్, నవంబర్ 28: పత్రికారంగంలో నూతన ఒరవడికి ప్రముఖ సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావు శ్రీకారం చుట్టారని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఎందరో మహానుభావుల మధుర స్మృతులు కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రముఖ సాహితీవేత్త నార్ల వెంకటేశ్వరరావు జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయాచితం శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై నార్ల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలుగు పత్రికలు సంప్రదాయ మూస విధానంలో గ్రంథక భాషకు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో భాష, సంపాదకీయాల్లో నూతన పద్ధతులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. నార్ల సంపాదకీయాలు ఆలోచనాత్మక, విశ్లేషణాత్మకంగా ఉంటాయన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత వడ్డెపల్లి కృష్ణ, చిక్కా రామదాసు, ఎస్బీ రామ్, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.