అల్లాపూర్, నవంబర్ 28: వయసు పైబడినా, ప్రమాదంలో గాయపడినా ఎముకల్లో నొప్పి తగ్గాలంటే ఫిజియోథెరపీ తప్పనిసరి. వివిధ అనారోగ్య సమస్యలతో రోజూ ఫిజియోథెరపీకి వెళ్లేవారు ప్రైవేటు దవాఖానలలో లెక్కకు మించి ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రజలకు మెరుగైన ఫిజియోథెరపీ వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ సభ్యులు ముందుక వచ్చారు. సుమారు దశాబ్దం క్రితం కూకట్పల్లి వివేకానందనగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీశ్, ప్రస్తుత అధ్యక్షుడు కొలన్ రాధామోహన్రావు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచితంగా ఫిజియోథెరపీ వైద్య సేవలను అందిస్తున్నారు. సంచార ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా ఫిజియోకేర్ రిహాబిలిటేషన్ కేంద్రం ద్వా రా నగరంలోని వివిధ బస్తీల్లో ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు. అంతేకాక అనాథ, వృద్ధ్దాశ్రమాల్లోనూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. నాలుగేండ్ల నుంచి కూకట్పల్లి వివేకానందనగర్, మోతీనగర్ కమ్యూనిటిహాల్లో ప్రతి రోజూ ఉ.9 నుంచి మ. 1.గం వరకు తిరిగి సా. 4 నుంచి రాత్రి 8వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. హ్యాండ్ గ్రిప్పర్, టైన్స్, ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ స్విస్ బాల్, షోల్డర్ వీల్, డెలాయిడ్ మైల్ స్టోన్స్, సైక్లింగ్ వంటి సామగ్రితో మెరుగ్గా వైద్యం చేస్తుండడంతో బాధితులు త్వరగా కోలుకుంటున్నారు.
అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్..
చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రిల చుట్టూ తిరిగి విసుగుచెంది మా వద్దకు వస్తుంటారు. అలాంటి వారికి ముందుగా అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్ ఇస్తాం. వారికి ఏయే నొప్పులకు ఏ రకంగా వైద్యం చేయాలో పరిశీలిస్తాం. ఆ తరువాత సమారు వారం రోజుల నుంచి నెల పాటు నిత్యం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తాం.
– డాక్టర్ కూరపాటి హరీశ్, ఫిజియోథెరపిస్టు