కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 23 : కాంక్రిట్ జంగిల్లా మారిన నగరంలో ప్రజలు కాసేపు సేద తీరేందుకు పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలనీలు బస్తీలలో కమ్యూనిటీ అవసరాల కోసం వదిలిన స్థలాలు, పార్కులు కబ్జాల పాలయ్యాయి. ఉన్న ఖాళీ స్థలాలు అభివృద్ధికి నోచుకోక పిచ్చి మొక్కలతో.. చెత్తాచెదారం నిండిపోయి డంపింగ్ యార్డులను తలపించేవి. ఇలా నిరుపయోగంగా మారిన ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ఆహ్లాదకరమైన పార్కులను అందుబాటులోకి తెస్తున్నారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డు పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటినీ ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు, పార్కుల అభివృద్ధి పనులు జరుగగా.. తాజాగా బాలాజీనగర్ కాలనీలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల కోసం సకల వసతులతో పార్కును అందుబాటులోకి తెచ్చే పనులు వేగంగా సాగుతున్నాయి.
రూ.50 లక్షలతో అభివృద్ధి..
ముంబై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కూకట్పల్లి బాలాజీనగర్లో విశాలమైన ఖాళీ స్థలమున్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.50 లక్షల నిధులను కేటాయించారు. ఈ పార్కులో చిన్నారులు, మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా వసతులను కల్పిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలం చుట్టూ పెన్షింగ్ను ఏర్పాటు చేయడం, చుట్టూరా వాకింగ్ ట్రాక్, సీనియర్ సిటిజన్లు కూర్చోడానికి గజిబో, యోగా షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులతో పాటు అన్ని వయసుల వారికి డీ మిటమిన్ కోసం ప్రత్యేక షెడ్డును నిర్మిస్తున్నారు. పక్కనే మల్టీపర్పస్ కోర్టును, చిన్నారుల కోసం ఇసుకతో కూడిని శాండ్ఫిట్, ైక్లెంబింగ్ వాల్ను నిర్మిస్తున్నారు. చిన్నారులతో తాతలు.. నానమ్మ.. అమ్మమ్మలు ఈ పార్కుకు వస్తే కాలాన్ని మర్చిపోయి ఆహ్లాదంగా గడుపుతారని అధికారులు చెబుతున్నారు. పక్కనే రూ.16 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ కూడా అందుబాటులో ఉండడంతో కుటుంబమంతా కలిసి ఈ పార్కుకు వస్తే ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే అవకాశముంది.
ఎమ్మెల్యే సహకారంతో..
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దడం జరుగుతున్నది. ఎమ్మెల్యే కృషి ఫలితంగా నిరుపయోగంగా ఉన్న స్థలాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. బాలాజీనగర్లో మహిళలు, చిన్నారులు, సీనియర్ సిటజన్ల కోసం ప్రత్కేక పార్కును ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనులు పూర్తైతే ప్రజలకు ఎంతోమేలు జరుగుతుంది.
– పగుడాల శిరీషాబాబురావు, కార్పొరేటర్