అమీర్పేట్, నవంబర్ 23 : తెలంగాణ వ్యాప్తంగా 2024 మార్చి నాటికి బలవర్ధకమైన బియ్యాన్ని పంపిణీ చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఎఫ్సీఐ ఆ దిశగా బియ్యం సేకరిస్తున్నదని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) డీజీఎం సుధాకర్రావు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని పథకాలకు, ప్రజా పంపిణీ వ్యవస్థలకు ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఆహార భద్రతతో పాటు పోషకాహార భద్రతకు కేంద్రం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఐరన్, ఫోలిక్, బి12తో కూడిన బియ్యాన్ని ఎఫ్సీఐ సేకరించి నిల్వలు చేసేందుకు బఫర్ స్టోరేజీలను కూడా సిద్ధం చేసిందని వివరించారు.
ఎఫ్సీఐ డివిజనల్ మేనేజర్ డాక్టర్ రాజన్కుమార్, డిపో మేనేజర్ కామాక్షి ప్రసాద్, క్వాలిటీ కంట్రోల్ విభాగం మేనేజర్ బాలమణి, ఎఫ్సీఐ శ్రామిక్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు ఖలీమ్ అహ్మద్లతో పాటు పలువురు మీడియా ప్రతినిధులతో కలిసి సనత్నగర్లోని ఎఫ్సీఐ గిడ్డంగులను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తున్న ఎఫ్సీఐ ఇకపై పోషకాహార భద్రతను కూడా పర్యవేక్షిస్తుందన్నారు. ఈ మేరకు అందరికి బలవర్ధకమై ఆహారాన్ని అందించే ఉద్దేశంతో మూడు దశల్లో బలవర్ధకమైన బియాన్ని అన్ని ఆహార భద్రతా పథకాలకు అందించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. మొదటి దశ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. తెలంగాణలోని అన్ని ఎఫ్సీఐ గిడ్డంగుల్లో బలవర్ధకమైన బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.