మేడ్చల్,నవంబర్ 23: పారిశుధ్యానికి ప్రాధాన్యత నివ్వాలని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులకు సూచించారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్లో బుధవారం ఆయన పర్యటించారు. కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వైకుంఠధామం, తడి, పొడి చెత్త వేరు చేయడం, స్వచ్ఛ ఆటోల పనితీరు, సమీకృత వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ పార్కు, ఎరువుల తయారీ పరిశీలించారు. డీఆర్సీసీతో పాటు ఎఫ్ఎస్టీపీ కేంద్రాన్ని సందర్శించారు. హరితహారంలో భాగంగా నర్సీల ఏర్పాటు, మొక్కల పెంపకం, వాటి నిర్వహణను పరిశీలించారు. అలాగే వీధి కుక్కల నియంత్రణ ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, నగర పరిధిలో రూ.7.5 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మాంసాహార పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుధ్యం, హరితహారానికి ప్రాధ్యానతనివ్వాలన్నారు.మేయర్ వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణారావు కార్పొరేషన్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు హరిశంకర్ రెడ్డి, అనంత రెడ్డి, రాజు, డీఈఈ శ్రీనివాస్, ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, ఏఈ వినీల్ కుమార్, టీపీఎస్ రాజీవ్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకీ, మేనేజర్ జ్యోతి, జగన్మోహన్ ఉన్నారు.
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో…
బోడుప్పల్, నవంబర్23: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా విస్తృతంగా పర్యటించారు. డంపిగ్యార్డు, శ్మశాన వాటిక, క్రీడాప్రాంగణాలను సందర్శించిన ఆయన వాటి అభివృద్ధి, నిర్వహణపై కమిషనర్ పద్మజరాణితో చర్చించారు.అనంతరం చెంగిచర్ల చింతల చెరువు అభివృద్ధిపై డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ లేవనెత్తిన సమస్యపై కమిషనర్ పద్మజరాణితో చర్చించారు.ఎస్ఎన్డీపీ పనితీరుపై ఆరా తీశారు. ప్రజల మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్ ఏర్పా టు, వాటి పురోగతిపై మేయర్ బుచ్చిరెడ్డి, కమిషనర్ పద్మజారాణితో చర్చించారు.కార్యక్రమంలో కార్పొరేటర్ చందర్గౌడ్, డీఈఈలు శారద, శ్రీలత, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.