సుల్తాన్బజార్, నవంబర్ 22 : నగరంలో నేరాలను అరికట్టడంలో సీసీ టీవీ కెమెరాలు దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగరంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కెమెరాలను ఏర్పాటు చే యడంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార కేంద్రంగా పేర్గాంచిన సుల్తాన్బజార్లో నేరాల సంఖ్యను అదుపులో పెట్టడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా 197 సీసీ కెమెరాలు, నేను సైతంలో భాగంగా 12,878 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిత్యం పెట్రోలింగ్, 24 గంటలు సీసీ టీవీ కెమెరాల పర్యవేక్షణతో నేరాల కట్టడికి కృషి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల కేసుల మిస్టరీ ఛేదించడంలో కెమెరాల పాత్ర ఉన్నది. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా లాభాలు, నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆయా పరిసరాలలో ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
మిస్టరీ కేసుల ఛేదనలో కెమెరాల పాత్ర ..
గతంలో మిస్టరీ కేసులు ఛేదించడానికి ఇబ్బందులు ఎదురయ్యేవి. సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఏ కేసు అయినా ఇట్టే ఛేదిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టి వెళ్లిన సమయంలో సదరు వాహనాన్ని పట్టుకునేందుకు ఆలస్యమయ్యేది. కానీ ఇపుడు ఫుటేజీ ఆధారంగా గుర్తించి బాధితులకు సత్వర న్యాయం జరుగుతున్నది. అర్ధరాత్రి జరిగిన దొంగతనాల కేసులలో నేరస్తులను పట్టుకోవడంలో సీసీ టీవీ కెమెరాల పాత్ర ఉందనడం అతిశయోక్తి కాదు.
వంద మంది పోలీసులతో సమానం
సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇప్పటికే కమ్యూనిటీ పోలీసింగ్లో 197, నేను సైతంలో భాగంగా 12, 878 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. బస్తీలు,కమ్యూనిటీలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు తర్వాత మిస్టరీ కేసులను త్వరితంగా ఛేదించగల్గుతున్నాం.
– బాలగంగిరెడ్డి, ఇన్స్పెక్టర్, సుల్తాన్బజార్