మెహిదీపట్నం, నవంబర్ 17: పది రోజుల కిందట కిడ్నాప్నకు గురైన 14 నెలల బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరుకున్నాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి, గురువారం రిమాండ్కు తరలించారు. ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఆర్జీ. శివమారుతి, ఇన్స్పెక్టర్ కె.నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు.
ఈనెల 6వ తేదీన మెహిదీపట్నం పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్- 13 సమీపంలో ఓ మహిళ (యాచకురాలు) తన 14 నెలల బాబుతో నిద్రిస్తున్నది. ఆమె మరుసటి తెల్లవారుజామున నిద్ర నుంచి మేల్కొని చూడగా బాబు కనిపించలేదు. దీంతో ఆమె వెంటనే ఆసిఫ్నగర్, హుమాయూన్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఇద్దరు మహిళలు బాబును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మహిళలు వెళ్లిన మార్గంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లారు. ఆ ఇద్దరు మహిళలు వికారాబాద్ రైల్వే స్టేషన్లో బాబును చూపిస్తూ ప్రయాణికుల వద్ద భిక్షాటన చేస్తున్నారు. పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని.. వారి చెర నుంచి బాలుడిని కాపాడారు. విచారణలో ఆ ఇద్దరి మహిళల పేర్లు దస్తమ్మ, లక్ష్మి అని చెప్పారు. మహిళలు నేరం చేసినట్లు అంగీకరించారు. గురువారం బాబును తల్లికి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్నదని పోలీసు అధికారులు తెలిపారు.