బోడుప్పల్, నవంబర్ 17: ప్రతి ఉద్యోగి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆర్టీసీ సంస్థ కృషి చేస్తున్నదని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మెగా హెల్త్ క్యాంపును బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి…చెంగిచెర్లలోని ఆర్టీసీ డిపోలో గురువారం రీజినల్ మేనేజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంస్థలో పని చేసే ప్రతి ఉద్యోగి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమైన ఐదు ప్రధాన పరీక్షలతో పాటు సాధారణ పరీక్షలు నిర్వహించి, రిపోర్టులను ఉద్యోగికి అందిస్తున్నామని తెలిపారు.
నష్టాల్లో కూరుకుపోయి, అగమ్య గోచరంగా ఉన్న సంస్థను ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఉద్యోగి శ్రమించి లాభాల బాటలోకి తీసుకొచ్చారన్నారు. దీంతో ఉద్యోగులకు మూడు డీఏలతో పాటు రోజు, ఇన్సెంటివ్లను తీసుకోగలుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎస్ ఈసు, అసిస్టెంట్ మేనేజర్లు మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ వేణుగోపాల రావు, డిప్యూటీ సూపరింటెండెంట్ అశోక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.