పీర్జాదిగూడ, నవంబర్17: టీఎస్ బీపాస్ ద్వారా 75 గజాల లోపు నిర్మాణాలకు కేవలం ఒక్క రూపాయికే ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నదని పీర్జాదిగూడ మేయ ర్ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్తో కలిసి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… మూడేండ్లలో కార్పొరేషన్ పరిధిలో రూ. 33.35 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఇంటి అనుమతుల జారీలో టీఎస్ బీపాస్ పేరుతో ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి నిర్మాణ దారులకు ఇన్స్టాంట్ పద్ధతిలో అనుమతులిస్తున్నదన్నారు. టీఎస్ బీపాస్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2916 దరఖాస్తులు రాగా వాటిలో 2426 దరఖాస్తుదారులకు ఇంటి అనుమతులు జారీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
త్వరలో 24 గంటలు మంచినీరు..
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఇంటికి త్వరలో 24 గంటలు మంచినీరు అందిస్తామని మేయర్ వెంకట్రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలో మిషన్ భగీరథ ఫేజ్-2లో భాగంగా మంచినీరు అందించేందుకు నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పైపులైన్ పనులను గురువారం మేయర్ , జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… మిషన్ భగీరథ ఫేజ్- 2లో నగర శివారు మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో 90 లక్షల లీటర్ల నీటి సరఫరా సామర్థ్యంతో నూతనంగా రిజర్వాయర్లు, పైపులైన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, జలమండలి అధికారులు ఎన్సీసీ ఏజెన్సీ ప్రతినిధులు పాల్లొన్నారు.