సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): లక్ష రూపాయలు పెడితే రోజు రూ.3 వేల లాభం.. అందులో జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ మినహాయించుకొని రూ. 2 వేల లాభం మీ చేతికి ఇస్తామంటూ నమ్మించారు. గొలుసు కట్టు విధానంలో అమాయకుల నుంచి ట్రేడింగ్ పేరుతో రూ.150 కోట్ల వసూలు చేసి ఓ సంస్థ బిచాణా ఎత్తేసింది. బాధితులు మంగళవారం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. రాంనగర్కు చెందిన ముక్తిరాజ్ గతంలో గొలుసుకట్టుకు సంబంధించిన కేసులో అరస్టై చర్లపల్లి జైలుకు వెళ్లాడు. జైల్లో సిబ్బంది పరిచయం అయ్యారు. తాను రియల్ ఎస్టేట్తో పాటు బంగారం, ఇనుము, ఇత్తడి, అల్యూమినియం, గ్యాస్, బొగ్గు తదితర వాటిపై ట్రేడింగ్ చేస్తానని, ఆయా వ్యాపారాల్లో పక్కాగా రోజు వారి లాభాలుంటాయని నమ్మించాడు. దీంతో జైలు సిబ్బంది, జైలు నుంచి ముక్తిరాజ్ బయటకు వచ్చిన తరువాత కూడా అతడితో టచ్లో ఉన్నారు.
లక్షకు రోజు రూ. 2 వేలు
జైలు నుంచి బయటకు రాగానే ముక్తిరాజ్ హబ్సిగూడ, స్ట్రీట్ నంబర్ 8లో ఒక కార్యాలయాన్ని తెరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. లాభాలు రాకపోవడం, మార్కెట్ అనుకూలించకపోవడంతో ట్రేడింగ్ వైపు రూట్ మార్చాడు. మల్టీ జెట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ట్రేడింగ్ కోసం ప్రత్యేకంగా ఓ యాప్ను తయారు చేయించాడు. అందులో బంగారం, వెండి, రాగి, ముడిచమురు, గ్యాస్, అల్యూమినియం, సీసం, నికిల్, కాటన్, మిథనాయిల్లపై ట్రేడింగ్ చేలా యాప్లో చూపించారు. అందులో రూ.100 నుంచి ఎన్ని లక్షలైనా పెట్టుబడి పెట్టవచ్చని, రోజు 3 శాతం లాభం ఇస్తామని… ఆ లాభంలో ఒక శాతం జీఎస్టీ, సర్వీస్ చార్జీ మినహాయించుకొని మిగతాది మీకు ఇస్తామని నమ్మించారు. ఈ ఏడాది జూన్లో ప్రారంభించారు. రెండు నెలల వ్యవధిలో వందల మంది సభ్యులుగా చేరారు.
ఒక్కరిని చేర్పిస్తే.. 11 మందికి కమిషన్
మొదట్లో చేరిన వారు గొలుసు కట్టు విధానంలో ఒక సభ్యుడిని చేరిస్తే, దానిపై ఉన్న 11 మందికి ఒక్కొక్కరికి 9 శాతం నుంచి ఒక శాతం వరకు కమిషన్ ఇచ్చారు. రోజుకు రూ. 2 వేలు.. ఒక్కరిని చేర్పిస్తే కమిషన్ ఇస్తుండటంతో ఆగస్టు, సెప్టెంబర్లోనే వేలాది మంది ఈ స్కీమ్లో చేరారు. కొత్త సభ్యులు చేరినప్పుడు కంపెనీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తేనే యాప్కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. అతడు చెల్లించిన డబ్బు ఆ యాప్లో స్క్రీన్పై కన్పిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సభ్యులు తన ఖాతాలో ఉన్న డబ్బుతో ట్రేడింగ్ చేయవచ్చు. మరోసటి రోజు లాభం యాప్లో కన్పిస్తుంది. ఆ లాభాన్ని వెంటనే తమ ఖాతాలోకి బదిలీ చేసుకునే వీలుంటుంది. ఇలా చాలా మంది గ్రూపులుగా తయారై రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెడుతూ వెళ్లారు.
ఈ నెల 10వ తేదీ వరకు లాభాలు ఇస్తూ వచ్చాడు. ఈ స్కీమ్పై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో చాలా మంది తమ ఖాతాల్లో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకునే ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడు డబ్బు డ్రా చేసుకోకుండా యాప్లో విత్ డ్రా ఆప్షన్స్ను బ్లాక్ చేశారు. బాధితులు కార్యాలయానికి వెళ్లి చూడగా కంపెనీ మూసేసి ఉంది. రాంనగర్లోని ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. వందల మంది బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు విచారణ అధికారి బాధితుల నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారని, చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని సీసీఎస్ అడ్మిన్ ఏసీపీ పూర్ణచందర్ బాధితులకు సూచించారు.
బాధితుల్లో జైళ్ల శాఖ సిబ్బంది
జెట్ ట్రేడింగ్ వ్యాపారాన్ని వేగంగా విస్తరించేందుకు ముక్తిరాజ్ సుమారు 10 మంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో బాగిరెడ్డి, సురేశ్, భాస్కర్, సతీశ్ ఉన్నారు. వీళ్లంతా ఈ ట్రేడింగ్పై అవగాహన కల్పించేందుకు సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహించారు. ముంబయిలో ఉన్న లింకులతో పెట్టుబడుల్లో నష్టం రాకుండా అంతా అక్కడ సెట్ చేశామని…బాధితులను ఈజీగా బుట్టలో వేసి, వ్యాపారాన్ని వేగంగా విస్తరించారు. నాలుగు బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ అందులో నుంచి దాదాపు రూ.100 కోట్ల వరకు ఇటీవల డ్రా చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.