హిమాయత్నగర్, నవంబర్ 15: ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కక్షతో భార్య, ఆమె ప్రియుడు, పదినెలల బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని నారాయణగూడ పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. సీఐ రాపోల్ శ్రీనివాస్రెడ్డి కథనం ప్రకారం… రాగులసాయి అలియాస్ నాగుల సాయి(27) అనాథ. చిక్కడపల్లిలో నివాసం ఉండే లక్ష్మీబాయి కుమార్తె ఆర్తీ(25)ని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.
వీరిద్దరికి 2016లో చరణ్ (5) పుట్టాడు. 2020లో వారిద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో ఆర్తీ తన పుట్టింటికి వచ్చి ఉంటోంది. రెండేండ్ల క్రితం ఆర్తీ సోదరుడు జితేందర్తో ఘర్షణ పడి అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలో న్యాయస్థానం నాగుల సాయికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో చిక్కడపల్లిలో ఉంటున్న నాగరాజుతో ఆర్తీ వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నది. దీంతో వీరికి విష్ణు అనే పది నెలల బాలుడు పుట్టాడు. జైలు నుంచి వచ్చిన నాగుల సాయికి భార్య ఆర్తీ విషయం తెలిసింది.
ఈ నెల 7న సాయంత్రం నారాయణగూడ ఫ్లై ఓవర్ సమీపంలో ఆర్తీ, ఆమె ప్రియుడు నాగరాజు పూలు విక్రయిస్తున్నట్లు స్నేహితుడు రాహుల్ సహాయంతో తెలుసుకున్నాడు. బాటిల్లో పెట్రోల్ తీసుకుని వచ్చి ఆర్తీ, నాగరాజు, బాలుడు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని గాంధీ దవాఖానకు తరలించారు. మంగళవారం బాగ్లింగంపల్లిలో పోలీసులు నాగుల సాయిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ ఈ నెల 8న విష్ణు (బాలుడు), 11వ తేదీన నాగరాజు, ఈ నెల 14న ఆర్తీ కడుపులో పెరుగుతున్న ఐదు నెలల శిశువు మృతి చెందింది. కాగా ఆర్తీ మృత్యువుతో పోరాడుతున్నది.