వ్యవసాయ యూనివర్సిటీ , నవంబర్ 15: పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశు వైద్య విశ్వవిద్యాలయం, భారతీయ వెటర్నరీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 39వ అంతర్జాతీయ వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నట్లు ఉపకులపతి డా.రవీందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సు ఏర్పాట్లను వివరించారు. మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పశువులు, కోళ్ల వ్యాధి నిర్ధారణ, తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి పద్మభూషణ్, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.కృష్ణ ఎల్ల, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీధర్ సిన్హా, ఐసీఎఆర్ డైరెక్టర్ డా. బీఎన్ త్రిపాఠి, డిప్యూటీ డైరెక్టర్, డీన్ డా.రఘునందన్రావు, రిజిస్ట్రార్ వీరోజి రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.లక్ష్మణ్, వివిధ దేశాలకు చెందిన పశువైద్య శాస్త్రవేత్తలు, అధికారులు, పశు వైద్య విద్యార్థులు దాదాపు 450 మంది పాల్గొననున్నారు.