చిక్కడపల్లి, నవంబర్ 15 : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి జనవరి 8వ తేదీ వరకు పోరు యాత్రను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల, ప్రైవేట్ యూనివర్సిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. విద్యార్థి, యువజనులను ఏకం చేసి జనవరి 8న వేలాది మందితో హైదరాబాద్లో బీసీ విద్యార్థి, యువజనుల మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యాం కుర్మ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, బైరి రవికృష్ణ, ఈడిగ శ్రీనివాస్గౌడ్, నాయకులు గోడుగు మహేశ్ యాదవ్, పండుగ బాల ముదిరాజ్, గండిచెర్వు వెంకన్న, ప్రవీణ్గౌడ్, స్వర్ణ గౌడ్, ఆంజనేయులు యాదవ్, వరికులప్పల మధు, జాజుల లింగం గౌడ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.