చిక్కడపల్లి, నవంబర్ 15 : పుస్తకాలు సమాజ ప్రగతికి ఉత్ప్రేరకాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. చిక్కడపల్లిలో నగర కేంద్ర గ్రంథాలయంలో (వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక నగర గ్రంథాలయం) 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం అక్కడ ఏర్పాటు చేసిన అరుదైన పుస్తక ప్రదర్శన, గ్రంథాలయ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికి, పుస్తక పఠనం ఏ మాత్రం తగ్గలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాల్లో అనేక పుస్తకాలను అందుబాటులో ఉంచడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయం చైర్పర్సన్ కె.ప్రసన్నరామ్మూర్తి, కార్యదర్శి పి.పద్మజ, గ్రేడ్-1 లైబ్రేరియన్లు ఎల్.చంద్రకళ, ఎం.సుబ్బలక్ష్మి, ఉద్యోగులు అవినాశ్, సుకేశ్కుమార్, వెంకటేశ్ యాదవ్, రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అయోధ్య, బొల్లం మహేందర్, మాజీ ఉద్యోగులు దేవేందర్, సత్యనారాయణ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.