కొండాపూర్, నవంబర్ 7 : క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేసే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైటెక్సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో రాష్ట్రంలోనే మొదటి ఎస్జీఆర్టీ (సర్ఫేస్ గైడెడ్ రేడియో థెరపీ), ట్రూబీమ్ – ఐడెంటిపై రేడియోథెరపీ సిస్టమ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సకు కచ్చితత్వంతో అత్యాధునిక టెక్నాలజీతో పని చేసే యంత్రాలను మెడికవర్ దవాఖాన అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. పేదలకు మెరుగైన వైద్యానందించేందుకు ప్రతి యేటా రూ. 11400 కోట్లను ఆరోగ్య శ్రీ, వైద్యసేవలపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదన్నారు. నవంబర్ 15న 8 కొత్త మెడికల్ కాలేజ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రానున్న రెండేండ్లలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున మొత్తం 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లో క్యాథ్ల్యాబ్తో సేవలతో పాటు క్యాన్సర్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్రెడ్డి, డాక్టర్ వినోద్ మద్దిరెడ్డి, మహేశ్ డెగ్లూర్కర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.