సిటీబ్యూరో, నవంబరు 7 (నమస్తే తెలంగాణ ): రోజురోజుకు నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల భద్రత కోసం జీహెచ్ఎంసీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. 2014-15 సంవత్సరం నాటికి 452 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫుట్పాత్ 2022 సంవత్సరం నాటికి 816.90 కిలోమీటర్లకు పెంచి ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ. 61.87 కోట్లు ఖర్చు చేశారు.
ఇందులో భాగంగానే 2022-23 సంవత్సరంలో ప్రమాదానికి గురవుతున్న ప్రాంతాలను గుర్తించి పాదచారులకు ప్రాణనష్టం వాటిల్లకుండా రూ.31.11 కోట్లతో మరిన్ని చోట్ల ఫుట్పాత్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటి వరకు 10.04 కోట్ల మేర పనులు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రూ.21.07 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వచ్చే ఫిబ్రవరి నాటికల్లా అన్ని పనులను పూర్తి చేసి పాదచారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నడిచేందుకు వీలుగా నిర్మాణం
గ్రేటర్లో 9100 కిలోమీటర్ల రోడ్లు ఉన్నప్పటికీ ఏడేండ్ల క్రితం 500 కిలోమీటర్లకు మించి ఫుట్పాత్లు ఉండేవి కావు. దీంతో పలు సందర్భాల్లో పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రాణనష్టం కూడా జరుగుతోంది. ప్రధాన రహదారుల పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్పుతుండడంతో అంతర్గత రహదారుల్లో రద్దీ ఉండే మార్గాల్లో ప్రజలు నడిచేందుకు వీలుగా ఫుట్పాత్లు నిర్మిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని స్థల సదుపాయాన్ని బట్టి వీటిని నిర్మిస్తున్నారు. పట్టణ రహదారుల ప్రమాణాల మేరకు ఫుట్పాత్ల వెడల్పు రోడ్డు వెడల్పులో కనీసం పది శాతం ఉండాలి.
అంటే 60అడుగుల రోడ్డుంటే కనీసం 6 అడుగుల వెడల్పుతో ఫుట్పాత్ ఉండాలని ఇంజినీర్లు చెబుతున్నారు. కానీ నగరంలోని పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యం కాదు. దీంతో తకువ స్థలమున్న ప్రాంతాల్లోనూ కనీసం 1.2 మీటర్ల వెడల్పుకు తగ్గకుండా ఫుట్పాత్ల నిర్మాణం జరుగుతున్నది. కనీసం ఈ వెడల్పు కూడా లేకపోతే పాదచారులు నడిచే పరిస్థితి ఉండదని భావించి ఈ నిర్ణయాన్ని ఆమలు చేస్తున్నారు.