సిటీబ్యూరో, నవంబరు 7 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డు లోపల రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తురయాంజాల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) లేఅవుట్కు సోమవారం జరిగిన ప్రీబిడ్ సమావేశం విజయవంతమైంది. తురయాంజాల్లో రెండో దఫా హెచ్ఎండీఏ 14ప్లాట్లను ఈ-అక్షన్ ద్వారా అమ్మకాలు జరుపనున్నది. తురయాంజాల్ లేఅవుట్ సైట్ వద్ద ప్రీబిడ్ సమావేశాన్ని హెచ్ఎండీఏ అధికారులు నిర్వహించారు. ఈ సమావేశానికి దాదాపు 100 మందికి పైగా ఆసక్తిగల ఔత్సాహికులు హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా లేఅవుట్ ప్రాధాన్యతను వివరించారు. ఈ సమావేశానికి హెచ్ఎండీఏ గంగాధర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్(సీపీఓ), సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) యూసఫ్ హుస్సేన్, తురయంజాల్ లేఅవుట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ)దన్ మోహన్ సింగ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)గౌతమ్, అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ) విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.