కవాడిగూడ, నవంబర్ 7: ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. రచన టెలివిజన్, భక్తి టీవీ సంయుక్త ఆధ్వర్యంలో వర్గల్ శ్రీ శారదా వైదిక స్మార్థ వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనంతో ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ఆహ్వానం, అన్నలింగానికి కోటి బిల్వార్చన, శైవక్షేత్రాల కల్యాణాలు చెర్వుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి, బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి, కొమురవెల్లి మల్లన్న, ఐనవోలు మల్లన్న కల్యాణోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. జ్వాలాతోరణ మహోత్సవం, ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీ గణపతిసచ్చిదానందస్వామి అనుగ్రహ భాషణం, కోటిదీపోత్సవం నిర్వాహకులు నరేంద్ర చౌదరి దంపతులతో కార్తిక దీపారాధన, భక్తులతో సామూహిక దీపారాధన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. రాజేశ్వర్ రావు, జస్టిస్ ఏ. సంతోశ్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.