పీర్జాదిగూడ, అక్టోబర్ 17: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, వాటిని విద్యార్థులు, యువకులు సద్వినియోగం చేసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ దర్గాదయాకర్రెడ్డి అభినందన సభకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దయాకర్రెడ్డిని వారు అభినందించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు.
అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘మన ఊరు మనబడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అన్ని పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించిదని, గ్రంథాలయ నిధులతో ప్రతి పాఠశాలను ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ శ్రీధర్, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఘట్కేసర్ మండల జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, పరిసర ప్రాంతాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.