సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత రెండు విద్యా సంవత్సరాల నుంచి జేఎన్టీయూలో డిటెన్షన్ విధానాన్ని అమలు పరుచలేదు. కరోనా వల్ల సెమిస్టర్ పరీక్షలు లేకుండా.. కేవలం ఆన్లైన్ క్లాసుల వల్ల బీటెక్ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. దీంతో వారంతా పై తరగతులకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో విద్యార్థులకు డిటెన్షన్ గురించి పెద్దగా తెలిసే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను తిరిగి విద్యార్థులకు అందించాలన్న లక్ష్యంతో 2022-23 విద్యా సంవత్సరం నుంచి డిటెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించడానికి జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనుబంధ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయా విద్యార్థులకు డిటెన్షన్ విధానం కొత్తగా అనిపిస్తుందని, అందువల్ల ఒక వర్గానికి చెందిన విద్యార్థులు దీనిని వ్యతిరేకిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. కానీ, నాణ్యమైన విద్యను అందించాలంటే.. డిటెన్షన్ విధానం ఎంతో మేలు చేస్తుందంటున్నారు.
ఈ ఏడాదికి మినహాయింపు ఉంటుందా..?
గత రెండేండ్లుగా అమలు చేయని డిటెన్షన్ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేయడం వల్ల గత రెండు విద్యా సంవత్సరాలకు చెందిన స్టూడెంట్స్కు నష్టం జరుగుతుందా..? 2022-23 విద్యా సంవత్సరంలో ఫస్టియర్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల పరిస్థితులు ఎమిటీ..? కేవలం ఈ సారి ఫస్టియర్ విద్యార్థుల నుంచి డిటెన్షన్ను అమలు చేయాలా..? గత ఏడాది విద్యార్థులకు ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలా..? మరి క్వాలిటీ విద్యను ఎలా అందుబాటులోకి వస్తుంది..? ఏమైనాప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా ? వంటి అనేక కోణాలలో యూనివర్సిటీ అధికారలు ఆలోచన చేస్తున్నారు. ఈ విషయంపైనా సోమవారం జేఎన్టీయూ హైదరాబాద్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆ యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. దీనిపై వీలైనంత త్వరలోనే స్పష్టత ఇవ్వడానికి సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం డిటెన్షన్ విధానం కొనసాగితేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి అవకాశం ఉంటుందని, ఫలితంగా మంచి ప్లేస్మెంట్ కూడా ఉంటాయంటున్నాయి.