సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఆమె స్కూల్ టీచర్. భర్త ప్రైవేటు ఉద్యోగి. వారికి 8 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. చిన్న కుటుంబం చింత లేకుండా సాగుతున్న వారి జీవితంలో మద్యం చిచ్చురేపింది. మద్యానికి బానిసైన టీచర్ భర్త తరచూ తాగొచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. మద్యం సేవించడం వల్ల అతడికి ఉన్న ఉద్యోగం కూడా పోయింది. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. చాలీ చాలని జీతంతో స్కూల్ టీచర్గా బతుకు బండిని లాగుతుండగా, ఆమె భర్త మాత్రం పనీపాట లేకుండా మద్యం మత్తులో జోగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. అంతే కాకుండా భార్యను రోజూ వేధించడం మొదలు పెట్టాడు. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు సైబరాబాద్ భరోసా కేంద్రాన్ని ఆశ్రయించింది. షీ టీమ్స్ డీసీపీ కవిత ఆదేశాల మేరకు ఈ కేసును డీ అడిక్షన్ సెంటర్ సిబ్బంది స్వీకరించారు. టీచర్ భర్తను పిలిపించి రెండు సార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం జీవితంపై ఎంత వరకు ప్రభావం చూపిస్తుందో వివరించారు. దీంతో అతడు ఒక్క అవకాశం ఇవ్వాలని తాను మారి చూపిస్తానని తన భార్యను వేడుకున్నాడు. ఈ క్రమంలో కేవలం ప్రత్యేక సందర్భాలు మినహా సాధారణ రోజుల్లో మద్యం మానివేసిన అతడు.. కొత్త ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం టీచర్ దంపతులు ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు షీటీమ్స్ డీసీపీ కవిత తెలిపారు.
నాకు వివాహమై 10 సంవత్సరాలు. మాకు ఎనిమిదేండ్ల కుమారుడున్నాడు. నేను ప్రైవేటు స్కూల్లో ప్రైమరీ టీచర్గా పనిచేస్తున్నా. నా భర్త ప్రైవేటు ఉద్యోగి. మా ఆయన చాలా మంచివాడు. అయితే కొంత కాలంగా ఫ్రెండ్ సర్కిల్లో తాగుడుకు అలవాటు పడ్డాడు. రోజు కొట్టడం, తిట్టడం చేస్తుండేవాడు. సైబరాబాద్ భరోసా కేంద్రం అధికారులు మా ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మొత్తానికి నా భర్త ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి.. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. నాలాంటి ఎంతో మంది జీవితాలను నిలబెడుతున్న సైబరాబాద్ భరోసా కేంద్రం, షీటీమ్స్ సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా షీటీమ్స్ డీసీపీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నలుగురు సిబ్బందితో 2018లో భరోసా కౌన్సెలింగ్ సెంటర్ను ప్రారంభించాం. అందులో క్లీనికల్ సైకోథెరపిస్ట్, లీగల్ కౌన్సిలర్, సోషల్ కౌన్సిలర్, రిసెప్షనిస్ట్ ఉన్నారు. కొన్ని రోజుల కిందట భరోసా కేంద్రంలో భాగంగానే డీ-అడిక్షన్ సెంటర్లను కూడా ప్రారంభించాం. దీని ద్వారా ముఖ్యంగా మద్యానికి బానిసై భార్య, కుటుంబ సభ్యులను వేధించే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. తాజాగా శుక్రవారం ఎనిమిది మందికి డీ అడిక్షన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇచ్చాం. ప్రతి వీకెండ్లో ఈ డీ అడిక్షన్ సెంటర్ ద్వారా మద్యానికి బానిసై, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేసే వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. 2018 నుంచి నేటి వరకు మొత్తం 2625 మందికి సైబరాబాద్ భరోసా కేంద్రం ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చాం. వీరిలో అత్యధికంగా గృహ హింసకు సంబంధించి 2498 మంది ఉండగా 99 మంది పోక్సో బాధితులు, లైంగిక దాడులకు సంబంధించిన బాధితులు 22 మందికి కౌన్సెలింగ్ ద్వారా భరోసా కల్పించాం. 781 మంది గృహ హింస బాధితులకు వేధింపుల నుంచి విముక్తి కల్పించాం.