అమీర్పేట్, సెప్టెంబర్ 25: సనత్నగర్లోని కేఎల్ఎన్ జీహెచ్ఎంసీ పార్కును రూ. 3 కోట్ల వ్యయంతో సుందరవనంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. వచ్చే నెల 11న అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగనున్న నేపథ్యంలో ఆదివారం జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డిలతో కలిసి మంత్రి పార్కులో పర్యటించారు. పార్కులో చేపట్టే అభివృద్ధికి సంబంధించిన నమూనాలను జీహెచ్ఎంసీ అధికారులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేఎల్ఎన్ పార్కును సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని పంచే విధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పార్కు ఆవరణలోని కుంటలో బోటింగ్ను ప్రవేశపెడతామని, మరిన్ని ఆధునిక క్రీడాపరికరాలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా పార్కులో నలుమూలలా నిఘా నేత్రం పర్యవేక్షణలో ఉండేలా సీసీ కెమెరాలు, చక్కటి లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి, ఈఈ ఇందిర, జలమండలి జీఎం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.