సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్-న్యూ) గోవాలో చేస్తున్న ఆపరేషన్ అక్కడి డ్రగ్ సామ్రాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. డ్రగ్స్ దందాలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఒక డాన్ తనకు కరోనా వచ్చిందంటూ నకిలీ సర్టిఫికెట్తో గోవా పోలీసులకు చుక్కలు చూపించాడు. ఆ సర్టిఫికెట్ నకిలీదని హైదరాబాద్ పోలీసులు అక్కడే రుజువు చేయించారు. దీంతో గోవా పోలీసులు సదరు డాన్పై తాజాగా చీటింగ్ కేసు నమోదు చేశారు. గోవాను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడంలో హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కృషికి అక్కడి ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఏండ్ల తరబడి గోవాలో డ్రగ్స్ విక్రయిస్తూ డాన్లుగా కొనసాగుతున్న వారిపై హెచ్-న్యూ పంజా విసరడంతో అక్కడి పత్రికలు, పోలీసులు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు నెలలో కీలక డ్రగ్ విక్రేత ప్రీతీష్ నారాయణ్ బోర్కర్ను, హెచ్-న్యూ, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ప్రీతీష్ ఇచ్చిన సమాచారంతో గోవాలోని డ్రగ్ సామ్రాజ్యాన్ని హైదరాబాద్ పోలీసులు కూల్చేశారు. ఈ పరిణామంతో గోవా పోలీసులు హైదరాబాద్ పోలీసులను ప్రశంసిస్తున్నారు. గోవాలో డ్రగ్ స్మగ్లింగ్లో డాన్లుగా కొనసాగుతున్న తోకారం సాల్ గోవకర్ అలియాస్ నానా, వికాస్ నాయక్ అలియాస్ విక్కీ, రమేశ్ చవాన్, డిసౌజా అలియాస్ స్టీవ్, ఎడ్విన్ నూన్స్, సంజా గౌవేకర్పై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఇందుకు గోవా డీజీపీతో మాట్లాడారు. గోవాలోని డ్రగ్స్ దందా గూర్చి హైదరాబాద్ పోలీసులకు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా కొంత సమాచారం ఇచ్చారు. డ్రగ్స్ను అణిచివేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హెచ్-న్యూ ద్వారా చేపడుతున్న ఆపరేషన్లకు తమ పూర్తి సహకారం అందిస్తామని గోవా అధికారులు చెప్పారు. దీంతో ఇటీవల డీసీపీ సునీతారెడ్డి నేతృత్వంలో, ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం గోవాలో డ్రగ్ డాన్లపై విరుచుకుపడింది. ఇందులో భాగంగా డిసౌజాను అరెస్ట్ చేసి, నగరానికి తరలించారు.
నకిలీ కరోనా సర్టిఫికెట్..!
అంజానా బీచ్ ప్రాంతంలో డిసౌజా డ్రగ్స్ దందాలో డాన్గా కొనసాగుతున్నాడు. అతడిని హెచ్న్యూ అరెస్ట్ చేసి దవాఖానకు తరలించడంతో అక్కడ నాటకీయ పరిణామాల మధ్య చికిత్స నిమిత్తం అక్కడి జిల్లా దవాఖానలో చేరాడు. అతడి నాటకాలను గుర్తించిన డీసీపీ సునీతారెడ్డి, అతడి వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలు అడుగాలంటూ న్యాయస్థానాన్ని కోరడం, అక్కడి వైద్యులకు ఊహించని షాక్ తగిలింది. దీనిని గుర్తించిన న్యాయస్థానం డిసౌజాకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయడంతో విమానంలో నిందితుడిని నగరానికి తరలించారు. మరో పక్క కుర్లిస్ రెస్టారెంట్ ఓనర్ ఎడ్విన్ నూన్స్పై హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు. అతడు డిసౌజా మాదిరిగానే డ్రగ్స్ దందాలో డాన్గా కొనసాగుతున్నాడు. డ్రగ్స్ తీసుకొని మృతి చెందిన బీజేపీ నాయకురాలు ఫోగట్ కేసులో నిందితుడు. అతడి గూర్చి ఆరా తీసి, స్థానిక పోలీసుల సహకారంతో పట్టుకోవడం కోసం ప్రయత్నించారు. తనకు కరోనా వచ్చిందని పేర్కొంటూ ఓ సర్టిఫికెట్ను అక్కడి పోలీసులకు పంపించాడు. అది నకిలీ సర్టిఫికెట్ అని హైదరాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న గోవా పోలీసులు.. ఎడ్విన్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. డిసౌజా అరెస్ట్తో డ్రగ్స్ డాన్లు అందరూ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లారు.
ఏమీ చేయలేరనే ధైర్యంతోనే..
డ్రగ్స్ దందాలో ఉన్న మోస్ట్వాంటెడ్ క్రిమినల్స్ గోవాలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల నెట్వర్క్ను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి గోవా వరకు ఈ డాన్లకు ఉన్న రాజకీయ పలుకుబడితో అక్కడి పోలీసులు కూడా టచ్ చేయలేకపోతున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో స్థానిక మీడియా, సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసంటే దమ్మున్న పోలీస్.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ పోలీసుల చొరవతో గోవా డ్రగ్ ఫ్రీ సిటీగా మారాలని అక్కడి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.