సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 ( నమస్తే తెలంగాణ ) : దసరా పండుగ రద్దీ దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రావెల్స్పై కొరడా ఝుళిపించేందుకు ఆర్టీఏ సిద్ధమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆర్టీవోలు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్, ఏఎంవీఐ, సిబ్బందితో ప్రత్యేక టీంలు ఆదివారం నుంచి రంగంలోకి దిగనున్నాయి. పండుగ సమయాల్లో సురక్షిత ప్రయాణంతోపాటు అధిక టికెట్ చార్జీలు లేకుండా ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు హైదరాబాద్ జేటీసీ పాండురంగ నాయక్, రంగారెడ్డి డీటీవో ఎం. ప్రవీణ్ రావు, మేడ్చల్ డీటీవో కిషన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక టీంలు నగరంలోని వివిధ రూట్లలో తనిఖీలు చేపట్టనున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్పై కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే సీజ్ చేయడం, కంపౌండింగ్ ఫీజు వసూలు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు ట్రావెల్స్ నడుస్తుంటాయి. ప్రయాణికుల వివరాల జాబితాతో పాటు మండే స్వభావం కలిగిన పదార్థాలను తీసుకెళ్లకుండా చూడటం..ఇద్దరు డ్రైవర్లు లేని ట్రావెల్స్పై కేసులు నమోదు చేస్తామని వివరించారు. తనిఖీల ముఖ్యఉద్దేశం ప్రమాదాలు జరగకుండా చూసుకోవడమేనని అధికారులు స్పష్టం చేశారు.