సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ):: జీహెచ్ఎంసీ నాలుగో సర్వసభ్య మంగళవారం సమావేశం సజావుగా సాగింది. ఆరు గంటల పాటు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 26 ఎజెండా అంశాలను జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించారు. నగరంలో పకడ్బందీగా శానిటేషన్ నిర్వహణకు సభ్యులందరితో కమిటీ వేస్తున్నట్టు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదాల నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ విభాగం కీలక తీసుకునే దిశగా చర్యలు జరుగుతున్నాయని టౌన్ఫ్లానింగ్ విభాగం సీసీపీ దేవేందర్ రెడ్డి సభ్యుల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 5 అంతస్తుల భవనం, అందులో వాణిజ్యపరమైన భవనాలకు ఫైర్ సేఫ్టీ విభాగం నుంచి అనుమతి (ఫైర్ ఎన్వోసీ) తప్పనిసరి కానుందని, ఈ నిర్ణయం త్వరలో అమలు చేసే ఆలోచన చేస్తుందన్నారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలన్నీ 15 మీటర్ల లోపు ఉండే భవనాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని, ఇదే విషయంపై ఫైర్సెఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ విస్తృతంగా చర్చించారని వివరించారు.
ఉదయం సభ ప్రారంభం కాగానే స్వాతంత్య్రోద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ సభను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 15 రోజుల పాటు నిర్వహించిన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలతో పాటు తెలంగాణ జాతీయ వజ్రోత్సవాలను సైతం విజయవంతంగా నిర్వహించుకున్నామని వెల్లడించారు. అదేవిధంగా గణేశ్ నవరాత్రులను జీహెచ్ఎంసీ అధికారులు ప్రశాంతంగా నిర్వహించారని, 4 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశామని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ ఎస్ఆర్డీపీ, మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనుల గురించి మేయర్ వివరించారు. రానున్న బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
రెండు నెలల్లోగా ఎస్ఎన్డీపీ తొలి విడుత పూర్తి
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు లేవనెత్తిన సమస్యలను సమాధానమిచ్చారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ పథకాల ద్వారా మోడల్ ఫిష్ మారెట్లను ఏర్పాటు చేశామని ప్రాజెక్ట్ సీఈ దేవానంద్ సభ్యులకు వివరించారు. కూకట్పల్లి, బేగంబజార్, మల్లాపూర్లో కలిపి మూడు చోట్ల అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.ఎస్ఎన్డీపీ ద్వారా రూ. 985 కోట్లతో జీహెచ్ఎంసీ, చుట్టుపకల మున్సిపాలిటీల్లో మొత్తం 60 పనులు చేపట్టగా అందులో జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 733 కోట్లతో 37 పనులను చేపట్టగా 35 పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని, మరో రెండు పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఈఎన్సీ జియాఉద్దీన్ తెలిపారు. 19 చోట్ల పనులు 70శాతం మేర పూర్తయ్యాయని, వర్షాల కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని, మరో రెండు నెలల్లో ఈ పనులు పూర్తి అవుతాయని ఈఎన్సీ సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు రూ. 1122 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశామని అడిషనల్ కమిషనర్ శృతి ఓఝూ వివరించారు.
ప్రభుత్వ బకాయిలపై దృష్టి పెట్టాం: జీహెచ్ఎంసీ కమిషనర్
ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ ఆస్తి పన్నులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ డీఎస్.లోకేశ్ మాట్లాడుతూ ముఖ్యంగా హాస్పిటల్స్, సూల్స్, పోలీస్ శాఖలకు సంబంధించిన భవనాల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిలు 1996 సంవత్సరం నుంచి ఉన్నట్లు తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన 58:42 శాతం నిర్దేశించిన ప్రకారం చెల్లించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపిందని, అయినా ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో నిధులను కూడా మంజూరు చేస్తుందని కమిషనర్ వివరించారు.
ఆ టూలెట్ బోర్డులకు జరిమానా వేయం
ప్రకటనల విభాగం సంబంధించిన డిస్ ప్లే బోర్డ్స్, ఫ్లెక్సీ, బ్యానర్ల విషయంలో అడ్వరె్టైజ్ మెంట్ పాలసీ విషయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి సమాధానం చెప్పారు. అక్రమ హోర్డింగ్లపై ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే జారిమానాను పారదర్శకంగా ఆన్లైన్లోనే వసూలు చేస్తున్నామని తెలిపారు. సొంత ఆస్తులపై టూలెట్ బోర్డులు పెట్టినవారికి ఎలాంటి జరిమానా వేయమని చెప్పారు. కమర్షియల్ భవనాల్లో ఒక బోర్డు కంటే ఎకువ ఉన్నచో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జరిమానా విధిస్తామని, అక్రమ హోర్డింగ్లపై 99 శాతం సోషల్ మీడియా ద్వారానే ఫిర్యాదు చేస్తున్నారని విశ్వజీత్ చెప్పారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, అమిన్ ఉల్ జాఫ్రీ, దయానంద్, ఎమ్మెల్యేలు గోపీనాథ్, నాగేందర్, అహ్మద్ పాషా ఖాద్రీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, అడిషనల్ కమిషనర్లు బి.సంతోష్, శృతి ఓఝూ, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి, సీసీపీ దేవేందర్ రెడ్డి, ఈఎన్సీ జియా ఉద్దీన్, సీఈ దేవానంద్, అడిషనల్ సీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు మమత, పంకజ, శంకరయ్య, సామ్రాట్ అశోక్, రవికిరణ్, శ్రీనివాస్ రెడ్డి, జలమండలి డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి పాల్గొన్నారు.
సంతృప్తికరంగా కౌన్సిల్ సమావేశం:టీఆర్ఎస్ కార్పొరేటర్లు
కౌన్సిల్ సమావేశం సంతృప్తికరంగా జరిగిందని టీఆర్ఎస్ కార్పొరేటర్లు అన్నారు. ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా శానిటేషన్లో లోపాలపై మాట్లాడామన్నారు. ఇంటింటి చెత్త సేకరణపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని కార్పొరేటర్లు వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి, సంక్షేమంపై ఓర్వలేకనే బీజేపీ కార్పొరేటర్లు విమర్శలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్కు జై కొడితే తప్పేంటని చెప్పారు.
బీజేపీ కార్పొరేటర్లకు టీఆర్ఎస్ కౌంటర్
ప్రజా సమస్యల కంటే తమకు సొంత ప్రయోజనాలే ముఖ్యమని, సభ మర్యాదలు పాటించకుండా బీజేపీ కార్పొరేటర్లు మరోమారు హంగామా సృష్టించారు. అధికారులపై వ్యక్తిగత కామెంట్లు చేసి నవ్వుల పాలయ్యారు. అధికారులు పార్టీ కండువాలు కప్పుకుని పనిచేస్తున్నారన్న బీజేపీ కార్పొరేటర్ల వ్యాఖ్యలపై మేయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు మార్లు మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనకు దిగడాన్ని మేయర్ తప్పుపట్టారు. తొలుత టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్లను కార్పొరేటర్ మన్నె కవిత పొగిడారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి టీఆర్ఎస్లో చేరానని బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టడంతో మేయర్ సభను వాయిదా వేశారు. కాంగ్రెస్ , బీజేపీ నేతలు రెండు దఫాలుగా సభకు అంతరాయం కల్పించగా, ఎమ్మెల్సీ ప్రభాకర్ సర్దిచెప్పి సభ సజావుగా సాగేలా చూశారు.
సమస్యలపై సుదీర్ఘ చర్చ
ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరిగింది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల హోరాహోరీ నినాదాల కారణంగా మూడు సార్లు సభకు అంతరాయం జరిగింది. దాదాపు ఆరు గంటల పాటు సమస్యలపై అన్ని పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చ జరిపారు.ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని, రాంకీ ఏజెన్సీ పనితీరుపై మేయర్ సహా అన్ని పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గార్బేజీ ఫ్రీ సిటీగా మార్చేందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని, ఇందుకుగానూ త్వరలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని మేయర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈవీడీఎం, టౌన్ప్లానింగ్, ఎస్ఎన్డీపీ, ఎంటమాలజీ తదితర విభాగాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. పార్టీల వారీగా ప్రశ్నలకు మేయర్ అవకాశం కల్పించారు. బీజేపీకి 12, టీఆర్ఎస్ 5, కాంగ్రెస్కు ఒకటి, ఎంఐఎం పార్టీకి ఐదు ప్రశ్నలపై మాట్లాడగా, అధికారులు ఇందుకు సమాధానాలు ఇచ్చారు.