మేడ్చల్, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గిరిజనుల, ఆదివాసీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ఆదివారం జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులను మంత్రి మల్లారెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే గిరిజనబంధు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, గిరిజనులపై ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రజలందరూ వజ్రోత్సవాలను పండగ వాతావారణంలో జరుపుకున్నారని అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అభివృద్ధిలో అధికారుల కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధురాలైన జానాబాయికి మంత్రి మల్లారెడ్డి పాదాభివందనం చేశారు.
ఉత్సవాలు విజయవంతం
జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వజ్రోత్సవాలు విజయవంతం అయ్యాయని జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి అన్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు అందరినీ ఉత్సహపర్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, మేయర్లు జక్క వెంకట్రెడ్డి, బుచ్చిరెడ్డి, కావ్య, డీసీసీబీ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, డీఈవో విజయకుమారి, కలెక్టర్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మల్లయ్య, రవి జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ఏకపాత్రాభినయం
వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి చేసిన ఏకపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేక అంశాలతో కూడిన ఏకపాత్రాభినయం చేసిన అదనపు కలెక్టర్ను మంత్రి మల్లారెడ్డి అభినందించారు.