దుండిగల్, సెప్టెంబర్ 9: బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(వీఎన్ఆర్ వీజేఐఈటీ) కళాశాలలో ‘అక్షర’ పేరిట గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు సాహితీ వేడుకలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు సాహిత్య కూటమి అయిన విజ్ఞానజ్యోతి సాహితీవనం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ ముగింపు వేడుకలకు ‘యే జుడ్’ వ్యవస్థాపకుడు అజయ్ హనుమంతు, ద్రవిడ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ పులికొండ సుబ్బాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అజయ్ హనుమంతు మాట్లాడుతూ.. తెలుగు అన్నది కేవలం భాష కాదని, ఒక జీవనశైలి అని అన్నారు. మరో అతిథి పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ.. మనల్ని మనం ప్రపంచానికి ఎలా పరిచయం చేసుకోవాలో వివరిస్తూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. భాషా వేడుకలను నిర్వహిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని ఈ సందర్భంగా ప్రశంసించారు.
అనంతరం ఆచార్య సీడీ నాయుడు మాట్లాడుతూ.. ఈ వేడుకలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని అన్నారు. కళాశాల సంచాలకులు డాక్టర్ బి.చెన్నకేశవరావు మాట్లాడుతూ.. ఏఐసీటీఈ తెలుగులో ఇంజినీరింగ్ విద్యను అందించే అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. ఈసీఈ సహాయ ఆచార్యులు పోపూరి సురేశ్బాబు ఈ వేడుకలకు కూటమి అధ్యాపక సమన్వయకర్తగా వ్యవహరించారు. విజ్ఞాన్జ్యోతి సంస్థ ప్రధాన కార్యదర్శి జేఎస్. రావు, అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్బాబు, అధ్యాపకుల ప్రోత్సాహం, సహకారాలతో ‘అక్షర’ వేడుకలను విజయవంతంగా పూర్తి చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.