బేగంపేట్, సెప్టెంబర్ 3: రాంగోపాల్పేట్ డివిజన్ నల్లగుట్టలో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. పేలుడు ధాటికి భవనం గోడలు కూలిపోయాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. నేపాల్కు చెందిన సందీప్(21), అను(18) దంపతులు నల్లగుట్ట జే లైన్లోని భవనంలో మొదటి అంతస్తులో నివసిస్తూ అదే ప్రాంతంలోని ఎఫ్ఎస్ గార్మెంట్స్లో పనిచేస్తున్నారు. యజమాని అమరదీప్ సింగ్కు చెందిన ఇంట్లోనే వీరికి బస కల్పించారు.
శనివారం ఉదయం సందీప్ సిగరెట్ వెలిగించేందుకు గ్యాస్ స్టౌవ్ వెలిగించబోయాడు. అయితే రెగ్యులేటర్ ఆన్లో ఉండటం, గ్యాస్ లీక్ కావడంతో అప్పటికే గది నిండా గ్యాస్ నిండిపోయింది. ఆ సమయంలో స్టౌవ్ వెలిగించడంతో ఒక్కసారిగా పేలుడు జరిగింది. సందీప్, అనులకు గాయాలయ్యాయి. రాంగోపాల్పేట్ పోలీసులు హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, పేలుడు ధాటికి గదికి రెండు వైపులా ఉన్న గోడలు బద్దలైపోయ్యాయి. సుమారు 15 మీటర్ల దూరంలో శిథిలాలు ఎగిరిపడ్డాయి. మరికొన్ని శిథిలాలు ఇంటి ముందు ఉండే గణేశ్ మండపంపై పడటంతో కూలింది. అదృష్టవశాత్తు పేలుడు జరిగిన సమయంలో భవనానికి ముందు, వెనుక వైపు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రాంగోపాల్పేట్ ఇన్స్పెక్టర్ లింగేశ్వరరావు, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.