మేడ్చల్, సెప్టెంబర్ 3(నమస్తే తెలంగాణ): గురుకులాల్లో స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన చాంబర్లో శనివారం స్వచ్ఛ గురుకుల పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీ నుంచి 11 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకులాలలో పారిశుధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ఎస్సీ గురుకుల పాఠశాలలో పకడ్బందీగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలన్నారు.
ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా ఈ నెల 5వ తేదీన చెత్త తొలగింపు, 6న పాఠశాల భవనంలోని పడక గదులను శుభ్రం చేయడం, 7న మూత్రశాలలు నీటి ట్యాంకుల శుభ్రం, పారిశుధ్య ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీలు నిర్వహించడం, 8న కిచెన్ డైనింగ్ ఏరియా పరిసరాలు పరిశుభ్రత, 9న పాఠశాల పరిసరాలలో మొక్కలతో సుందరీకరణ, 10న సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 11న వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్, ఎస్సీ గురుకులాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.