సిటీబ్యూరో, సెప్టెంబరు 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా అన్ని శాఖలు సమన్వయంతో వినాయక నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా జోనల్ కమిషనర్లు, పోలీస్, విద్యుత్, జలమండలి, ఈవీడీఎం విభాగాల అధికారులతో మేయర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని, నగరంలో 74 కొలనుల వద్ద వ్యర్థాల తొలగింపునకు శానిటేషన్ సిబ్బందిని 3 షిఫ్టుల్లో పనిచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
నిమజ్జనం తర్వాత విగ్రహాలను వెంటనే తొలగించాలని, కొలన్లలో నీటిని ఎప్పటికప్పుడు నింపాలన్నారు. శోభాయాత్ర సాఫీగా జరిగేలా రహదారుల వెంట చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ తీగలు వేలాడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొలనుల వద్ద ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు తాగునీటి ప్యాకెట్లు అందించాలని జలమండలి అధికారులకు తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా వాహనాల క్రమబద్ధీకరణ చేపట్టాలని..నిమజ్జనం సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్ల వల్ల ఇబ్బందులు రాకుండా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం చర్యలు చేపట్టడంతోపాటు చెరువులు, కొలన్ల వద్ద గజ ఈతగాళ్లు, సరిపడా బోట్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సంతోష్ మాట్లాడుతూ నిమజ్జనం కోసం 10 వేలమంది శానిటేషన్ సిబ్బందిని నియమించామని, కొలనుల వద్ద 25 మంది సిబ్బంది, ఒక క్రేన్ వద్ద 7-14 మంది వరకు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారని చెప్పారు. నిమజ్జనానికి 280 క్రేన్లు, 130 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సమీక్ష సమావేశంలో సీడీపీ రమణారెడ్డి, ఈఎన్సీ జియావుద్దీన్, జోనల్ కమిషనర్లు రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాసరెడ్డి, మమత, పంకజ, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.