వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల్లో కొలువుదీరిన లంబోదరులు విశేష
పూజలందుకుంటున్నారు. తీరొక్కఆకృతుల్లో నెలకొల్పిన వినాయకులను చూసేందుకు భక్తులు మండపాల వద్ద బారులు తీరుతున్నారు. స్వామివారిని దర్శించుకొని విఘ్నాలు తొలగాలని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరికొన్ని గణపతి ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్, సెప్టెంబర్ 2: ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనుల్లోనే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ సర్కిల్-29లోని చిలకలగూడ మున్సిపల్ మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులను శుక్రవారం అధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గ్రేటర్ వ్యాప్తంగా శాశ్వత కొలనులతో పాటు తాత్కాలికంగా 74 కొలనులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొలనుల వద్ద క్రేన్లు, తాగునీరు, పోలీసు బందోబస్తు, మూత్రశాలలు తదితర వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం పూర్తయిన వెంటనే వ్యర్థాలను తొలగించే పనులు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిలకలగూడ మైదానంలో మట్టి గణపతులకు, పీఓపీ గణపతులకు వేరువేరు తాత్కాలిక కొలనులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఈఈ ఆశాలత, ఏఎంహెచ్ఓ రవీందర్ గౌడ్, ఎలక్ట్రికల్ ఏఈ భరత్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం
ఎకో ఫ్రెండ్లీ గణేశ్ నిమజ్జనం వాహనాలను ప్రారంభించిన మంత్రి తలసాని
పర్యావరణ పరిరక్షణకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద మొట్టమొదటి సారిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ కింద ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు ఎకో ఫ్రెండ్లీ గణేశ్ నిమజ్జనం వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, టీఎస్ ఫుడ్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్తో కలిసి ప్రారంభించారు. ఈ వాహనంపై ఏర్పాటు చేసిన నీటి తొట్టిలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంటి ముందే వినాయకుడి నిమజ్జనం చేసే విధంగా వాహనాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అవసరాలను బట్టి వచ్చే సంవత్సరం మరిన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈసారి సుమారు 38 వేల విగ్రహాలను నెలకొల్పినట్లు చెప్పారు. ప్రభుత్వం ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఊరేగింపు, నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బేబీ పాండ్స్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రీడమ్ ఆయిల్ మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ సురేశ్, తదితరులు పాల్గొన్నారు.