సికింద్రాబాద్, ఆగస్టు 24: నార్త్జోన్ పరిధిలోని ఓ వస్త్ర దుకాణం మేనేజర్ పార్ట్ టైం ఉద్యోగానికి సంబంధించి వచ్చిన ఆన్లైన్ లింక్పై క్లిక్ చేశారు. ముందుగా సైబర్ నేరగాళ్లు రూ.500 విలువైన వస్తువు అమ్మాలని సూచించారు.. అలా రోజురోజుకీ కొంతమొత్తం పెంచుకుంటూ వెళ్లేవారు. వారం కిందట రూ. 5 లక్షల వస్తువు అమ్మాలని, ముందుగా తమ ఖాతాలో నగదు వేయాలని చెప్పారు.
ఎప్పటిలాగే వస్తువులు అమ్మితే నగదు వచ్చేస్తుందనుకుని రూ.5 లక్షలు పంపించాడు. ఇప్పుడు అవతలి వ్యక్తుల సెల్ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉండటంతో లబోదిబోమంటున్నారు.చెందిన ఓ యువకుడు తన సెల్ఫోన్కి వచ్చిన లింకుపై క్లిక్ చేశాడు. అడిగిన వివరాలన్నీ ఇవ్వడంతో వెంటనే అప్పు ఇచ్చారు. మొత్తం బాకీ తీర్చేసినా.., ఇంకా చెల్లించాలని డిమాండు చేస్తున్నారు. లేకపోతే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
బోయిన్పల్లికి చెందిన గృహిణి నగరంలోని ఓ దుకాణంలో పని చేస్తోంది. అప్పు ఇస్తారని ఆన్లైన్ లిం క్పై క్లిక్ చేసింది. అప్పు ఇచ్చిన దాని కంటే రెట్టింపు డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇలా నగరంలోని నార్త్జోన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రెండు నుంచి మూడు వరకు కేసులు నమోదవుతున్నాయి. మోసగాళ్లు ఏ మాత్రం అవకాశం దొరికినా ఖాతాలు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక రకాలుగా గాలాలు వేసి సామాన్యులను ఆర్థికంగా కుంగ దీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఫోన్ల వినియోగం అధికమైంది. వీటిని ఆసరాగా చేసుకున్న నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ లింక్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. నగదును ఆశ చూపి, వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యం గా యువతకు ఎర వేసి అప్పులిస్తామని చెప్పి ఆశ పెడుతున్నారు. వివరాలు తీసుకుని అడిగిన సొమ్ము ఆన్లైన్లో పంపించేస్తున్నారు. మొత్తం తిరిగి చెల్లించినా ఇంకా ఇవ్వాలని వేధింపులకు దిగుతున్నారు. నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువే. అంద రూ పోలీసులను ఆశ్రయించడం లేదు.
మీ కేవైసీ ఆప్డేట్ చేయాలని ఫలానా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అని ఎవరైనా చెబితే అసలు నమ్మొద్దు. పొరపాటున చేస్తే ఆ యాప్ల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ బ్యాంక్ ఖాతాను క్షణాల్లో ఖాళీ చేస్తారు. ఆన్లైన్లో వెంటనే అప్పులిస్తామని చెప్పే యాప్లకు దూరంగా ఉండండి. ఒకవేళ తీసుకుంటే తరువాత కొత్త సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది.
మీకు లాటరీ వచ్చింది. కొంతమొత్తం చెల్లిస్తే లాటరీలో వచ్చిన డబ్బులను ఇస్తామని చెబితే నమ్మకండి.
మైక్రోఫైనాన్స్ ఆన్లైన్ బుణాల యాప్లు డౌన్లోడ్ చేయకండి. మీరు తిరిగి లోన్ చెల్లించకపోతే మీకు, మీ స్నేహితులు, బంధువులకు బెదిరింపు కాల్స్, నోటీసులు రావొచ్చు.
ఆన్లైన్లో వస్తువులు కొనే విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. నమ్మకమైన యాప్లనే వినియోగించండి.
మీ స్థలంలో ఫలానా కంపెనీకి చెందిన సెల్ టవర్ ఏర్పాటు చేస్తాం. నెలకు రూ.25 వేలు అద్దె చెల్లిస్తాం. పదేళ్లు అగ్రిమెంట్ చేసుకుంటే రూ.20 లక్షలు ఇస్తాం. ఇందుకు ముందుగా రిజిస్ట్రేషన్ కోసం రూ.లక్ష చెల్లించండి అని ఎవరైనా ఫోన్ చేస్తే అది మోసమని గ్రహించండి.
ప్రజలు, ముఖ్యంగా యువత యాప్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అప్పులిస్తామని ఆశ చూపి సైబర్ నేరగాళ్లు ఎరవేస్తుంటారు. ఆ వలలో చిక్కుకుంటే ఆర్థికంగా నష్టపోతారు. ఆన్లైన్లో కనిపించినా ప్రతి లింక్ను క్లిక్ చేయకూడదు. అలా చేస్తే కొన్నిసార్లు మన వ్యక్తిగత వివరాలు అపరిచిత వ్యక్తులకు తెలిసిపోతాయి. బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడే ఎక్కువ మోసాలు జరుగుతాయి. ఎవరైనా మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
– సీహెచ్. నేతాజీ, ఎస్హెచ్ఓ,మారేడ్పల్లి