మైలార్దేవ్పల్లి, ఆగస్టు 19: బ్రేకులు ఫెయిలైన కంటైనర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు గాయపడ్డారు. మైలార్దేవ్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధుబన్కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న రవిఫుడ్స్ ప్రైవెట్ లిమిటేడ్ పరిశ్రమలోకి ముడి సరుకుతో వచ్చిన గుజరాత్కు చెందిన కంటైనర్ లారీ బయటికి వస్తుండగా, ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదే సమయంలో శ్రీరామ్కాలనీ నుంచి కోఠికి 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీరామ్కాలనీకి చెందిన జ్ఞానేశ్వర్ చేతికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, ప్రమాద సమయంలో పరిశ్రమ గేటు ముందు మరో కంటైనర్ ఉండటంతో బస్సు బోల్తాపడకుండా పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కంటైనర్ డ్రైవర్ సలీంను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన వారిని ఉస్మానియా వైద్యశాలకు తరలించారు.