సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : జాతీయభావం ఉప్పొంగింది.. జనగణమన మార్మోగింది.. సామూహిక జాతీయ గీతాలాపన సమైక్యతను మరోసారి చాటింది.. నిమిషంపాటు నగరజనం మమేకం కావడంతో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఎక్కడివారక్కడ జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. రహదారులపై నిమిషం పాటు ట్రాఫిక్ను నిలిపివేసి జాతీయగీతం పాడారు. ఇండ్లు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నిలబడిన చోటే కార్యక్రమం నిర్వహించారు.
అబిడ్స్ జీపీవో వద్ద జరిగిన ఉత్సవానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు వేలాదిమంది తరలివచ్చి జాతీయతను చాటారు. ఉప్పల్, కూకట్పల్లి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్, సుచిత్ర తదితర కూడళ్లలో ‘జనగణమన’ మార్మోగింది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 30వేల మంది విద్యార్థులతో సామూహిక జాతీయ గీతాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమీర్పేట నుంచి మియాపూర్ వరకు దివ్యాంగ, అనాథ చిన్నారులతో నిర్వహించిన మెట్రో జాయ్ రైడ్ వారిలో ఉత్సాహం నింపింది.
నగరమంతా త్రివర్ణ శోభితమైంది. జాతీయ భావం ఉప్పొంగింది. భరత మాత సంబురపడిపోయింది.స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం గ్రేటర్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఉదయం 11:30 గంటలకు లక్షలాదిమంది భరత మాత ముద్దుబిడ్డలు నగరంలోని పలు కూడళ్ల వద్దకు స్వచ్ఛందంగా ఉప్పెనలా తరలివచ్చి 58 సెకండ్ల పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో ఆయా కూడళ్లు జన సందోహంతో త్రివర్ణ శోభితంగా మారగా.. భారత్ మాతాకీ జై.. జై జవాన్.., జై కిసాన్.. నినాదాలతో మారుమోగాయి. మెట్రో రైళ్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార సముదాయాలు ఏకకాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియమాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మైకుల్లో జాతీయ గీతం వినిపించారు. అబిడ్స్లోని జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనగా, ఉప్పల్, సుచిత్ర, కూకట్పల్లి, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ తదితర కూడళ్లలో భారీ స్పందన లభించింది. సిగ్నల్స్ వద్ద నిమిషం పాటు రెడ్ సిగ్నల్స్ ఇచ్చి అంతా ‘జనగణమన’ ఆలపించేలా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో 30వేల మంది విద్యార్థులతో సామూహిక జాతీయ గీతాలాపన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.