తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 16: భారతీయ భాషలలోని మాధుర్యాన్ని చిన్నారులు పద్యధారణ చేసి భాషా ప్రియులను మెప్పించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న బాల కవి సమ్మేళనం ఆబిడ్స్ తిలక్ రోడ్డులోని తెలంగాణ సారస్వత పరిషత్తులో మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన 130 మంది విద్యార్థులు పాల్గొని తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ భాషలలో దేశభక్తిని చాటుతూ కవితలను వివరించారు. బాల కవులకు వేదిక కలిపించాలనే ఉద్దేశంతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారని, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తెలిపారు. ఉపాధ్యక్షులు మంచాల వరలక్ష్మి, గుండం మోహన్రెడ్డి, సాహిత్య విభాగం కన్వీనర్ కాంచనపల్లి, సనమ్వయకర్త ఘనపురం దేవేందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, జాగృతి నాయకులు కుమారస్వామి, విక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు.