చిక్కడపల్లి, ఆగస్టు 16 : రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల నాయకులను, మహనీయులను గుర్తించి గౌరవిస్తుందని అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ అడగగానే ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 18న సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ కమిషన్ చైర్మన వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యుడు కిశోర్గౌడ్, మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, మల్లురవి, హన్మంతరావు, బెల్లయ్య నాయక్, గౌడ సంఘం హాస్టల్ అధ్యక్షుడు పల్ల లక్ష్మణ్ గౌడ్, ముఠా జయసింహ తదితరులు హాజరై సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గౌడ సంక్షేమం, అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందన్నారు. సర్వాయి పాపన్న బహుజన వీరుడు, ఆనాడే బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని కుల వృత్తులను ఐక్యం చేసి పోరాటం చేశారని తెలిపారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చరిత్ర లేకుండా చేశారని, పాపన్న జయంతిని అధికారికంగా చేయాలని కోరుతే గతంలో ఏ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం కేసీఆర్ను అడగగానే అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పాపన్న జయంతి నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల నాయకులకు, మహనీయులకు గౌరవిస్తుందన్నారు. పాపన్న ఒక్క కులాని సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అడుగులో ముందు సాగాలని పిలుపునిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కుల వృత్తులను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, ఎస్వీ రమణ, గడ్డమీది విజయ్కుమార్, విజిఆర్ నారగోని, ముఠా జయసింహ, రాజేంద్ర ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గీత వృత్తిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
మంత్రి శ్రీనివాస్ గౌడ్
చిక్కడపల్లి, ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత వృత్తిని ప్రోత్సహిస్తుందని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. గౌడల అభివృద్ధికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రవీంద్ర భారతిలో 18న అధికారికంగా నిర్వహించే పాపన్న జయంతి సభకు పెద్ద సంఖ్యలో బహుజనులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేశ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, సంఘం అధ్యక్షుడు వంగ సదానందం గౌడ్, ఉపాధ్యక్షుడు మార్కం లింగయ్య గౌడ్, బీమాగాని గీత గౌడ్, మల్యాల రాములు గౌడ్, గౌడ విద్యార్థి సంఘం నాయకుడు శ్రీకాంత్ గౌడ్, హరిశంకర్ గౌడ్, వెంకటేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాపన్న జయంతిని జయప్రదం చేయండి
పల్లె లక్ష్మణ్రావుగౌడ్
సిటీబ్యూరో, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ అన్నారు. ఈ నెల 18న రవీంద్రభారతితోపాటు జిల్లా కలెక్టరేట్ల వద్ద ఉదయం 10 గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్లకు తెలంగాణ గౌడ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని గీత కార్మికులు, గీత పారిశ్రామిక సొసైటీ బాధ్యులు, గౌడ ఉద్యోగులు, గౌడ సంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.