సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మహాత్ముడే స్ఫూర్తి..శాంతి మన మంత్రమని, గాంధేయవాదం స్వాతంత్య్ర ఉద్యమాన్ని రగిలించిందని రాష్ట్ర అబ్కారీ, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో తెలంగాణ సాహిత్య అకాడమీ-తెలంగాణ బుక్ ట్రస్టు సంయుక్తాధ్వర్యంలో ‘భారత స్వాతంత్య్రోద్యమ ప్రధాన ఘట్టాలు-మహాత్మాగాంధీ సూక్తులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవాన్ని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వదేశీ ఉద్యమమంటేనే గుర్తుకు వచ్చేది గాంధీ అని, చరకాను తిప్పుతూ స్వదేశీ వస్తువులను ఆదరించాలని చెప్పిన మహాత్ముడాయన అని పేర్కొన్నారు.
ఈ మహోత్సవంలో సుమారు గాంధీ గురించి 3వేల పుస్తకాలతో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయమని చెప్పారు. ఖాదీ దుస్తులు ధరించి స్వాతంత్య్రోద్యమానికి పిలుపునిచ్చిన ఘనత ఆయనదని తెలిపారు. గాంధీ, భగత్సింగ్, సుభాష్, అల్లూరి, ఆజాద్, లాంటి వాళ్లు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్య్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఆనాటి వీరులత్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛావాయులని వారి త్యాగాలను స్మరించుకున్నారు. అందరికీ అన్ని రంగాల్లో సమానత్వం, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలని కలలుగన్న మహాత్ముడి కలలను సాకారం చేసేందుకు, ఈ విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమానికి ఎన్ని అవాంతరాలు ఎదురైనా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో శాంతియుతంగా పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని, అందుకు మహాత్ముడి బోధనలు స్ఫూర్తిని నింపాయని చెప్పారు. ఖాదీ దుస్తులు ధరించడంతో పాటు గానుగ నూనెను వినియోగిస్తే ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. మహాత్ముడి బుక్స్టాల్ను సందర్శించి పుస్తకాలను పరిశీలించారు. అనంతరం మగ్గం స్టాల్ను, నూనెతీసే గానుగను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
సహజసిద్ధ విధానాన్ని బోధించిన గాంధీని ఆచరించాలి : జూలూరు గౌరీశంకర్
సహజసిద్ధ విధానాన్ని బోధించిన మహాత్మాగాంధీ సూక్తులను ఆచరించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ ఆలోచనా విధానాలు ప్రజలకు తెలియపర్చేందుకు వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన కృషి చేస్తున్నదన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 8గంటల వరకు ఈనెల 22వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనున్నట్లు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ పూర్వపు అధ్యక్షుడు కృతికాంత్ భారతి, సభ్యులు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.