సుల్తాన్ బజార్, ఆగస్టు 14: రోజు రోజుకూ విద్యా విధానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, పలు రకాల కొత్త కోర్సులు సైతం పుట్టుకొస్తున్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందడం పరిపాటి. ఇలాంటి సందేహాస్పద సందర్భంలో టీ-న్యూస్ నిర్వహించిన గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒక మార్గదర్శిగా మారిందని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అనంతరం ఏ చదువులు చదివితే తమకు బాగుంటుంది? అని ఆలోచిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు టీ న్యూస్ గొప్ప అవకాశాన్ని ఆధ్వర్యంలో నిజాం కళాశాలలో నిర్వహిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ వరప్రదాయినిగా మారింది. ఆదివారం రెండో రోజైన ఈ ఫెయిర్కు విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులు తమకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలలో చదువుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, సలహాలపై ఈ ఫెయిర్లో నివృత్తి చేసుకోవడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రధాన ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్టాళ్ళను ఏర్పాటు చేసుకొని తమ కళాశాల వాతావరణంతో పాటు విద్యా బోధన, ప్లేస్ మెంట్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
అంతే కాకుండా మాక్ కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు నిష్ణాతులైన అధ్యాపకులచే ఎటువంటి కోర్సు తీసుకుంటే బాగుంటుందని విద్యా ర్థులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. రెండో రోజు కొనసాగిన ఈ ఫెయిర్లో ఉస్మానియా యూనివర్సిటీ సివిల్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్ నాయక్ సివిల్ ఇంజనీరింగ్లో అవకాశాలు, కోర్సుకు ఉన్న డిమాండ్పై క్లుప్తంగా అవగాహన కల్పించారు. అంతే కాకుండా ఇంజనీరింగ్ విద్యపై ప్రొఫెసర్ డాక్టర్ మహిపతి శ్రీనివాస రావు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను ప్రొఫెసర్ నిత్యానందరెడ్డి నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీన్యూస్ సీజీఎం ఉపేందర్, డీజీఎం కిరణ్, మార్కెటింగ్ టీం సభ్యులు సత్యపాల్, శ్రీనివాస్, భాస్కర్, వెంకట్రెడ్డి, సతీష్తో పాటు విద్యార్థులు,తల్లి దండ్రులు పాల్గొన్నారు. ఈ ఫెయిర్కు వచ్చిన కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు వారి మాటల్లోనే…
పలు సందేహాలకు సమాధానం.. ఈ ఫెయిర్
ఉన్నత విద్యకై విద్యాభ్యాసం కొనసాగించే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు ఉంటాయి. పిల్లలు ఉన్నత విద్య ఏ కళాశాలలో చేస్తే బాగుంటుందని ఆలోచించే మాలాంటి తల్లిదండ్రులకు ఈ ఫెయిర్ ఎన్నో సందేహాలకు సమాధానంగా నిలుస్తున్నదన్నారు. నా కూతురి కోసం కళాశాలను ఎంపిక చేసుకునేందుకు ఈ ఫెయిర్కు వచ్చాం. ఇక్కడ అన్ని కళాశాలల స్టాళ్ళు ఒకే వేదికపై ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఇంటర్మీడియట్ అనంతరం, ఏయే కోర్సులు చేస్తే బాగుంటుంది? అని అవగాహన కల్పించడం ద్వారా కళాశాలను ఎంచుకోవడం సులభతరంగా మారింది. – గీత, విద్యార్థిని తల్లి, బడంగ్పేట్
ఈ ఫెయిర్కు రావడంతో పలు సందేహాలు తీరాయి
ఎంసెట్ రాశాను నచ్చిన కళాశాలను ఎంపిక చేసే క్రమంలో.. ఎంతగానో ఆలోచించినా.. ఏ కళాశాలలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కు వచ్చా. ఈ ఫేయిర్కు రావడంతో తన సందేహాలు నివృత్తి అయ్యాయి. ఈ ఫెయిర్ తమలాంటి విద్యార్థులకు ఎంతగానో దోహదం దోహదపడుతుంది. విద్యార్థుల కోసం టీ న్యూస్ ఆధ్వర్యంలో ఈ ఫెయిర్ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.
– శివాని, బడంగ్పేట్
కళాశాలల పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు
కళాశాల వాతావరణంతో పాటు విద్యా బోధన, ప్లేస్మెంట్ తదితర పూర్తి వివరాలను తెలుసు కునేందుకు ఈ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి కళాశాలలను, నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈ ఫెయిర్ దోహదం చేస్తుంది. ఎంసెట్లో వచ్చిన ర్యాంకుకు అణుగుణంగా కళాశాలలో చేరేందుకు అవకాశం కల్పించినందుకు ఫెయిర్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ధృవిత, విద్యార్థిని, దిల్సుఖ్నగర్
నచ్చిన కళాశాలలో చేరేందుకు దోహదం..
నచ్చిన కళాశాలను ఎంచుకునేందుకు తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ దోహదం చేస్తున్నది. ఈ ఫెయిర్ ఏర్పాటుతో ఏ కళాశాలలో చేరితే బాగుంటుందనే సందిగ్ధంలో ఉన్న తనకు కళాశాలల పూర్తి వివరాలతో పాటు ఏయే కోర్సులు చేస్తే బాగుంటుందని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంటర్మీడియట్ అనంతరం, ఉన్నత విద్యకై ఎటువంటి చదువులు చదివితే బాగుంటుందనే అంశంపై అవగాహన కల్పించడం సంతోషకరం.
– నిహారిక, విద్యార్థిని, మల్కాజిగిరి
ఫెయిర్ విద్యార్థులకో.. వరప్రదాయిని
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ఫెయిర్ వరప్రదాయినిగా మారిం ది. విద్యార్థులకు ఎంసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కళాశాలలను తామే ఎంచుకునేలా ఈ ఫెయిర్ను ఏర్పాటు చేయడం అభినందనీయం. విద్యార్థులకు ఏయే కోర్సులలో చుదవుకోవాలో స్టాళ్ళ నిర్వాహకులు ప్రత్యేకంగా క్లుప్తంగా అవగాహనను కల్పించడం ఎంతో బాగుంది.
– నందిని, విద్యార్థిని, సనత్నగర్